ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. వైసీపీలో బలమైన బీసీ నేతలుగా పేరున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ కూటమి వ్యూహాలు రచిస్తుందా అన్న చర్చ జోరందుకుంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల ఈ ఇద్దరు నేతలు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ మీద చేసిన విమర్శలకు సంబంధించిన పాత న్యూస్ క్లిప్పింగ్స్ వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ కాలంలో జగన్పై తీవ్ర విమర్శలు చేసిన నేతలే, ఇప్పుడు ఆయనను సమర్థించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా గతంలో వైఎస్ మరణానికి జగన్ కారణమని బొత్స పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యల న్యూస్ క్లిప్పింగ్ బయటపెట్టారు. దీనిపై బొత్స కన్నీరు పెట్టుకున్నారు కూడా.
Also Read : నెల రోజుల్లో బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 రచ్చ రచ్చ..!
అయితే రాజకీయాల్లో పార్టీ మార్పులు, నాయకత్వంపై అభిప్రాయాల మార్పు సహజమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు విమర్శించిన నేతలు, తరువాత అదే పార్టీలో చేరి నాయకుడిని ప్రశంసించడం అసాధారణం కాదని, ఇది రాజకీయ పరిణామాల భాగమంటున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం తీసుకొస్తున్న ఆరోపణలు పాతవే కావడంతో వాటికి పెద్దగా ప్రాధాన్యం లేదంటున్నారు కూడా. ఇదిలా ఉంటే, ఉత్తరాంధ్రలో బలమైన ప్రభావం కలిగిన ఇద్దరు నేతలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక టీడీపీ రాజకీయ వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక నేతలకు, పార్టీ అధిష్టానం మధ్య విభేదాలు సృష్టిస్తే అది రాజకీయంగా తమకు లాభం చేకూరుస్తుందన్న ఆలోచనతోనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ వైసీపీలో సాగుతోంది.
Also Read : ప్రభాస్ ఫౌజీ కోసం హను రాఘవపూడి వైల్డ్ ప్లాన్.. ఆర్సీబీ కనెక్షన్ ఏంటి..?
మరోవైపు, ఉత్తరాంధ్ర సమస్యలపై బలంగా స్పందిస్తున్న నాయకులనే టార్గెట్ చేయడం సరైనదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పాత ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకురావడం వల్ల ప్రజల్లో ఎంతవరకు ప్రభావం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బొత్స, ధర్మాన అంశం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలు వైసీపీలో అంతర్గతంగా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? టీడీపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

