ప్రతిపక్ష నేత హోదా కోసం కొందరు నేతలు ఆరాటపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి, లేదా ప్రతిపక్ష నేత.. ఇవే పార్టీ అధ్యక్షుల టార్గెట్. ఏదో ఒకలా చట్టసభలో సౌకర్యాలు అనుభవించాలనేది నేతల లక్ష్యం. ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓడిన పార్టీకి చెందిన నేతకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే గెలవాలంటే సభలో మ్యాజిక్ ఫిగర్ ఎంత ముఖ్యమో.. ఓడిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా కూడా సభలో కనీసం పది శాతం సీట్లు గెలవాల్సి ఉంది. అలా గెలవని పార్టీకి ప్రతిపక్ష గుర్తింపు కష్టమనేది రాజ్యాంగ నియమం. అందుకే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ తేల్చి చెప్పారు. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే.. కనీసం 18 స్థానాలు గెలవాలి. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అందుకే హోదా ఇవ్వటం సాధ్యం కాదన్నారు. అయితే జగన్ మాత్రం.. తనను ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వాలంటూ హైకోర్టులో కూడా పిటీషన్ దాఖలు చేశారు.
Also Read : గుంటూరు గడ్డపై మరో పెమ్మసాని మార్క్ సక్సెస్..!
చట్టసభలో ప్రతిపక్ష నేత పదవి అనేది ముఖ్యమంత్రి పదవితో సమానం. క్యాబినెట్ హోదా ఉన్న ప్రోటోకాల్ పదవి కూడా. అందుకే చట్టసభల్లో ప్రతిపక్ష నేతలకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తాజాగా విడుదలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత పదవి ఎవరికి వస్తుందనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రెండు రాష్ట్రాల్లో కూడా అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. బెంగాల్లో సీఎం మమతా బెనర్దీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో కొళత్తూర్ నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ కూడా టీవీకే అభ్యర్థి చేతుల్లో ఓడిపోయారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత ఎవరూ అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
డీఎంకే తరఫున స్టాలిన్ ఓడినప్పటికీ.. ఆయన కుమారుడు ఉదయ నిధి స్టాలిన్ గెలిచాడు. కాబట్టి ఆయననే ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే స్టాలిన్కు, మమతాకు కూడా అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ గెలిచారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకటి ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. అప్పుడు అక్కడ నుంచి స్టాలిన్ పోటీ చేసి విజయం సాధిస్తే.. ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం ఉంది. కానీ విజయ్ రాజీనామా చేసిన నియోజకవర్గం నుంచి ఆయన తండ్రి లేదా నటి త్రిష పోటీ చేసే అవకాశం ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. స్టాలిన్ గెలుపు కష్టమే.
Also Read : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. కీలక గెజిట్ విడుదల..!
అలాగే బెంగాల్లో బీజేపీ సీఎం అభ్యర్థి సువేందు అధికారి కూడా నందిగ్రామ్, భవానీపూర్ నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిల్లో ఒకచోట రాజీనామా చేయాల్సిందే. అప్పుడు అక్కడ నుంచి మమతా పోటీ చేసి గెలవాలి. అయితే రెండు చోట్ల కూడా అధికార పార్టీలు తమ ఖాతాలోని సీటు వదులుకునే అవకాశం చాలా తక్కువ. అధికారంలో ఉన్న పార్టీ గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తుంది. కాబట్టి పోటీ చేసి మరోసారి ఓడితే.. సీనియర్ నేతలకు పరువు పోతుందనే భయం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్నికలకు దూరంగా ఉండటమే ఉత్తమం అని ఇరువురు నేతలు భావించే అవకాశం కూడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఏపీలో మొదలైన ప్రతిపక్ష నేత చర్చ.. ఇప్పుడు తమిళనాడు, బెంగాల్లో కూడా జోరుగా జరుగుతోంది.

