విభజన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర సర్కార్.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026, జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ గెజిట్ తో జోన్ పరిధి, డివిజన్ల విలీనంపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది.
Also Read : కాషాయ భారతం.. కమల వికాసం..!
కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి ఈ జోన్ ను ఏర్పాటు చేశారు. అలాగే రాయగడ డివిజన్ పరిధిని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా పలాస-ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం-దువ్వాడ-విజయనగరం, నౌపడ-పర్లాకిమిడి, బొబ్బిలి-సాలూరు, సింహాచలం-వడ్లపూడి, విశాఖ-జగ్గయ్యపాలెం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్ లో విలీనం చేశారు.
Also Read : భారత్ ఫై నేపాల్ ను రెచ్చగొడుతున్న చైనా..!
కోరాపుట్-కిరండోల్ లైన్ ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. విశాఖపట్నంలోని ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ శాశ్వత కార్యాలయాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన పూర్తయింది. అయితే, శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యేలోపు కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా.. వీఎంఆర్డీఏ డెక్ లోని రెండు అంతస్తుల్లో జోన్ జనరల్ మేనేజర్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. జూన్ 1 నుంచే ఇక్కడి నుంచి అధికారిక పనులు ప్రారంభమయ్యేలా రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీ మొత్తం రైల్వే కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్రం గెజిట్ విడుదల చేయడం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

