వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు నేతలంతా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీల కూటమిలోని అభ్యర్థులే విజయం సాధిస్తారని ఇప్పటికే సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇదే తమకు అనుకూల సమయంగా నేతలు భావిస్తున్నారు. తమ వారసులను ఎన్నికల బరిలో నిలిపి.. వారి రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమం చేయాలనే తపనతో అడుగులు వేస్తున్నారు.
Also Read : నేను రాజీనామా చేయాలంటే సిఎం చేయాల్సిందే..!
ఇదే సరైన సమయం అనుకుంటున్న బీజేపీ సీనియర్ నేత కూడా తన కుమార్తె కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కూతురు రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీ ఎమ్మెల్యే ఫీట్లు చేస్తున్నారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కుర్చీలో తన కూతురిని చూసుకోవాలని ఆ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యేకు కోరికగా ఉందట. ఆ కోరిక తీర్చుకునేందుకు ఆ బీజేపీ ఎమ్మెల్యే అవకాశం ఉన్న అన్ని మార్గాలను వెతుకుంటున్నారు. ఈ అన్వేషణలో ఆయనకు కనిపించిన ఒకే ఒక ఆశా జ్యోతి గురించే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బీజేపీ ఎమ్మెల్యే.. ఇప్పుడు యువ నేతను మెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారిగా చంద్రబాబు, పవన్ కల్యాణ్కు పేరు. అదే సమయంలో కూటమిలో కీలక నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు పవన్, నారా లోకేష్. ఈ ముగ్గురిలో మంత్రి నారా లోకేష్ ద్వారా అయితేనే తన పని సులువు అవుతుందని సదరు బీజేపీ ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సన్నిహితుల మాట. అందుకే మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో దగ్గరుండి మరీ స్వాగత, సన్మాన ఏర్పాట్లు చూస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కుమార్తె పేరును ప్రస్తావిస్తున్నారు కూడా. ఇదే విషయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న లోకేష్ కోసం బీజేపీ ఎమ్మెల్యే రావడం ఎందుకు అనేది తెలుగు తమ్ముళ్ల ఆశ్చర్యం.
Also Read : వెలిగొండ.. నీటి పంపకాల గోల..!
2014లో విశాఖపట్నం ఎంపీ సీటును టీడీపీ పొత్తుతో బీజేపీ గెలుచుకుంది. అదే ఎన్నికలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు.. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి కేవలం 18 వేల ఓట్లు మాత్రమే సాధించారు. ఆ ఎన్నికలో నాలుగో స్థానంలో నిలిచారు. మళ్లీ 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన విష్ణుకుమార్ రాజు.. ఏకంగా 47 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ ఫ్లోర్ లీడర్గా క్యాబినెట్ హోదాలో ఉన్న విష్ణుకుమార్ రాజు.. తన కుమార్తెను విశాఖ మేయర్ను చేయాలని ఆశ పడుతున్నట్లు సన్నిహితుల మాట.
త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖ మేయర్ పోస్టుకు కూడా నేరుగా ఎన్నిక జరగనుంది. టీడీపీ, జనసేన పార్టీలు విశాఖలో బలంగా వున్న నేపథ్యంలో అక్కడ నుండి తన కుమార్తెను మేయర్ పదవి బరిలో నిలబెడితే.. అవలీలాగా విజయం సాధించవచ్చని బీజేపీ ఎమ్మెల్యే రాజు గారికీ బాగా తెలుసు. అయితే ఈ విషయంలో మంత్రి లోకేష్ను తనకు అనుకూలంగా మలుచుకుంటే చాలు… ఆయన ద్వారా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ను ఒప్పించటం పెద్ద కష్టం కాదనే భావనలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సులువుగా ఒప్పించవచ్చని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నమ్మకంతో ఉన్నారు.
Also Read : ఇకపై నాయకుల కోసం కాదు : పవన్ సంచలన కామెంట్స్..!
కానీ టీడీపీతో పొత్తులో భాగంగా విశాఖపట్నం మేయర్గా జనసేన పార్టీ అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో అంటున్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ముందుగా లోకేష్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే లోకేష్ ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా టీడీపీ నాయకుల కంటే ముందే లోకేష్ను కలుస్తున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. తన మనసులో కోరికను ఇప్పటి వరకు లోకేష్కు అయినా చెప్పారో.. లేదో.. ఇప్పటి వరకు తెలియదు. విశాఖ మేయర్ సీటు మాదే అని జనసేన బల్లగుద్ది మరీ చెబుతోంది. కానీ విష్ణుకుమార్ రాజు మాత్రం.. తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి బీజేపీకి అవకాశాలు ఏ మాత్రం లేవు. కానీ.. విష్ణుకుమార్ రాజు మాత్రం.. పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఫలిస్తాయో లేదో చూడాలి.

