తెలంగాణలో మంత్రులకు, ఐఏఎస్లకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా మంత్రుల ఆదేశాలకు ఐఏఎస్లు అంతంత మాత్రంగానే విలువ ఇస్తున్నారనే ప్రచారం ఉంది. కేబినెట్లో ఉన్న ముగ్గురు మంత్రుల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా తయారైంది. తమ శాఖకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్కు సంబంధించి కూడా తమ శాఖ ముఖ్య కార్యదర్శి, సెక్రటరీ, కమిషనర్ను బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధిత శాఖకు సంబంధించిన సీనియర్ ఐఏఎస్ల్లో చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాలకు నిమిషాల్లో స్పందిస్తున్నారని సెక్రటేరియట్లో చర్చ జరుగుతున్నది.
Also Read : 59 ఏళ్ళ తర్వాత కేబినేట్ లోకి కాంగ్రెస్..!
కేబినెట్లో 16 మంది మంత్రులు ఉన్నప్పటికీ 10 మంది మంత్రుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని భావిస్తున్నారు. వీరి శాఖలకు సంబంధించిన సచివాలయ అధికారులు ప్రతి పనిలో దాటవేత ధోరణి అవలంభిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. స్వయంగా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై ఆయా శాఖల మంత్రుల వద్దకు వెళ్తే పనులు కావడం లేదని, మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళితేనే సమస్య పరిష్కరం అవుతుందని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయాశాఖల మంత్రులు అందుబాటులో ఉంటున్నప్పటికీ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలున్నాయి. సచివాలయంలో చాలా పేషీల్లో ముందు బోర్డులు, లోపల సిబ్బంది మినహా బాసులు అందుబాటులో ఉండరని, మంత్రి పేషీ నుండి అధికారుల పేషీలకు ఫోన్లు వెళ్లినా.. సార్ ఇంకా రాలేదని, వచ్చి వెళ్లిపోయారనే సమాధానా లు ఉంటాయని మంత్రి పేషీకి సంబంధించిన వ్యక్తులే చెబుతున్నారు.
ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే ఐఏఎస్లు, ఐపీఎస్ల సహకారం తప్పనిసరి. అక్కడక్కడ కొంత మంది ఐపీఎస్లు అసంతృప్తిగా ఉన్నప్పటికీ పోలీసింగ్లో ప్రత్యేకత చాటుతున్నారు. కిందిస్థాయి అధికారులను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఐఏఎస్ల తీరే ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. సీనియర్ ఐఏఎస్లు ఒకరిద్దరు మినహా.. మిగతావారు ఎక్కడా యాక్టివ్గా పనిచేసినట్లు కనబడటం లేదు. జిల్లా కలెక్టర్లు కూడా కొద్ది మంది మినహా మిగతా వారు మొక్కుబడిగా పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనికి ఉదాహరణే ధాన్యం సేకరణ వ్యవహారం. జిల్లా కలెక్టర్లు మొదటే ఉత్సాహం ప్రదర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేది కాదు. సచివాలయం నుంచి డైరెక్షన్ రాకపోవడంతో పట్టీ పట్టనట్లు వ్యవహరించారు. కొంతమంది కలెక్టర్లయితే ఏకంగా పూర్తిగా నాణ్యమైన ధాన్యం కావాలని ప్రకటనలు చేయడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ సీఎం దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారు. అనంతరం మంత్రులు కూడా జిల్లాకు వెళ్లి చివరి ధాన్యపు గింజను కూడా కొంటామని చెప్పారు. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుపై సీఎస్ నుంచి కూడా జిల్లా కలెక్టర్లకు ఎటువంటి డైరెక్షన్ లేదు. అనుభవమున్న కలెక్టర్లు కొంతమంది జిల్లా రైతాంగానికి మేలు చేసినప్పటికీ మరికొంతమంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించారు.
Also Read : గన్నవరం రాజకీయం.. మళ్లీ మారుతున్న లెక్కలు..!
కొంతమంది ముఖ్య కార్యదర్శిస్థాయి అధికారులు, కార్యదర్శి స్థాయి అధికారులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శ ఉంది. జూనియర్లకు అవకాశాలు కల్పించడంతో అలక వహించి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో సలహాలు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతుంది. కొంతమంది సీనియర్ మంత్రులకు మాత్రమే స్పందించి మిగతా వారిని మంత్రులుగానే చూడటం లేదనే ప్రచారం ఉంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు ప్రచారంలో వెనుకబడి ఉన్నాయనే విమర్శ ఉంది. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జిల్లాల్లో కొంతమంది కలెక్టర్లు పట్టించుకోవడం లేదు.. సచివాలయానికి వస్తే కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల వద్ద కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు. ప్రధాన కార్యదర్శికి చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పైకి అనేక కారణాలు వినిపిస్తున్నా.. ఐఏఎస్ల అలక వెనుక ఉన్న అసలు విషయమేంటో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతుంది.

