తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ సంచలనంగా మారింది. గురువారం జరిగిన ఈ విస్తరణలో భాగంగా మొత్తం 23 మంది కొత్త ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారి మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈ కేబినెట్ విస్తరణ తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందనే మాట వినపడుతోంది.
Also Read : గన్నవరం రాజకీయం.. మళ్లీ మారుతున్న లెక్కలు..!
దాదాపు 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి అయింది. గతంలో 1967 మార్చి వరకు ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో డీఎంకే చేతిలో ఓడిపోయినప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ ఎప్పుడూ అక్కడ ప్రభుత్వంలో భాగం కాలేదు. తాజా విస్తరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, తిరు పి. విశ్వనాథన్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. టీవీకే ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణలో భాగం కాలేదు.
Also Read : నీటితో వ్యాపారం.. కోట్లల్లో సంపాదన..!
ఈ రెండు పార్టీలకు ఒక్కో కేబినెట్ బెర్త్ కేటాయించినప్పటికీ, వారి అభ్యర్థుల పేర్లను ఇంకా ఖరారు చేయకపోవడం వల్లే ప్రస్తుత ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల నేతలు కూడా మంత్రివర్గంలో చేరుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్ తొమ్మిది మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం తమిళనాడు కేబినెట్ లో గరిష్టంగా 35 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. తాజా విస్తరణతో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య 32కి చేరింది. మిత్రపక్షాల కోసం విజయ్ మరో 3 స్థానాలను ఖాళీగా ఉంచారు.

