గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తిరువూరు నియోజకవర్గం వేదికగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేస్తూ జరిగిన ఒక వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తిరువూరు ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న కారే నవీన్, అతని సోదరుడు కారే ప్రవీణ్ అనే వ్యక్తులు సోషల్ మీడియాలో రఘురామ కృష్ణంరాజుకు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.
Also Read : పవన్ అడ్డా అదేనా.. ఎవరూ మార్చలేరా..?
బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక కత్తితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “ఆఫ్ట్రాల్ ఒక ఎమ్మెల్యేని వేసెయ్యలేరా.. ఎలాగైనా టార్గెట్ పూర్తి చేస్తాడు” అంటూ రఘురామను ఉద్దేశించి వారు చేసిన పోస్టును స్వయంగా రఘురామ కృష్ణంరాజు వాట్సాప్ గ్రూపుల్లో బయటపెట్టారు. మతపరమైన అంశాలపై ప్రశ్నించినందుకు గాను తనను ఈ విధంగా లక్ష్యంగా చేసుకుని, నియోజకవర్గంలో జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్న సదరు వ్యక్తులు బెదిరింపులకు దిగడం వెనుక పెద్దల కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు.
Also Read : నేడే బండి భగీరథ్ అరెస్ట్..? షాక్ ఇచ్చిన హైకోర్టు..!
మరోవైపు, ఆకివీడు ఘటన తర్వాత రఘురామ కృష్ణంరాజు హిందూత్వ ఎజెండాతో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ దళిత సంఘాలు, కొందరు ఎస్సీ నాయకులు మండిపడుతున్నారు. కానీ, తాను కేవలం ఆలయాల పరిరక్షణ కోసమే పోరాడుతున్నానని, దీనికి కులమతాలను ఆపాదించడం సరికాదని రఘురామ వర్గం వాదిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, తిరువూరు ఎమ్మెల్యే అనుచరుల తాజా కత్తి స్టిల్ బెదిరింపులు, రఘురామ వాట్సాప్ పోస్టులతో ఈ వివాదం మరింత ముదిరింది.

