ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా మంత్రి నారా లోకేష్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫేస్బుక్ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారింది. “ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?” అనే క్యాప్షన్ తో, లోకేష్ స్వయంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను నడుపుతూ కనిపిస్తున్న ఈ వీడియో, రాష్ట్రానికి మరో మెగా పారిశ్రామిక ప్రాజెక్టు ఖరారైందన్న సంకేతాలను ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తన తయారీ యూనిట్ను ఏర్పాటు చేయబోతుందన్న వార్త ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read : వైరల్ అవుతున్న కార్ నెంబర్.. ముందే ఉహించాడా..!
పెట్టుబడుల వేటలో లోకేష్ విదేశీ పర్యటనలు, దిగ్గజ సిఈఓలతో ఆయన జరిపిన చర్చలు ఇప్పుడు ఒక్కొక్కటిగా క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తున్నాయని, ఈ సంస్థ రాక లోకేష్ ఖాతాలో మరో భారీ గోల్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించి ప్రధాన తయారీ కేంద్రాలన్నీ తమిళనాడులోనే కేంద్రీకృతమై ఉన్నాయి. చెన్నై సమీపంలోని తిరువొత్తియూర్, ఒరగడమ్, వల్లం వడగల్ ప్రాంతాల్లో ఉన్న మూడు ప్లాంట్ల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుల్లెట్ ప్రియుల అవసరాలను సంస్థ తీరుస్తోంది.
Also Read : యూపీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ శర్మకు.. బెంగాల్ లో పోస్టింగ్..!
ఇప్పుడు తమిళనాడు వెలుపల, పొరుగు రాష్ట్రమైన ఏపీలో తన ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవ్వడం వెనుక మంత్రి లోకేష్ చూపిన చొరవ, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏపీలో పుష్కలంగా ఉండటం, అలాగే పోర్ట్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటం వల్ల రాయల్ ఎన్ ఫీల్డ్ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపినట్లు సమాచారం. రాయల్ ఎన్ ఫీల్డ్ రాకతో ఏపీ.. దక్షిణ భారత ఆటోమొబైల్ హబ్ గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇప్పటికే అనంతపురంలో కియా మోటార్స్, చిత్తూరులో హీరో మోటోకార్ప్, అపోలో టైర్స్ వంటి దిగ్గజ సంస్థలు ఉండగా, ఇప్పుడు బుల్లెట్ తయారీ సంస్థ కూడా తోడవ్వడం వల్ల అనుబంధ పరిశ్రమలు భారీగా వచ్చే అవకాశం ఉంది.

