ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసిపి నేత అంబటి రాంబాబుతో కలిసి ఒకే వేదికను పంచుకుని, తీవ్ర వివాదంలో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రాజకీయంగా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఆ వివాదంపై పార్టీ అధిష్టానం వివరణ కోరడం, ఆ తర్వాత దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరగడం వెనువెంటనే ముగిశాయి. ఈ వివాదం కాస్త చల్లబడిన తరుణంలోనే బొండా ఉమా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెజవాడ పాలిటిక్స్లో తన అసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ను తెరపైకి తెచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో తన రాజకీయ వారసత్వాన్ని నెక్స్ట్ జనరేషన్కు అందించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
Also Read : ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?
ఇందులో భాగంగానే లేటెస్ట్గా బొండా ఉమా తన ఇద్దరు కొడుకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కలుసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఈ భేటీలో కోరినప్పటికీ.. అసలు అజెండా మాత్రం బొండా ఉమా పెద్ద కొడుకు బొండా సిద్ధార్థ్ పొలిటికల్ ఎంట్రీ అని తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తండ్రికి అండగా ఉంటూ క్షేత్రస్థాయిలో లోకల్ క్యాడర్తో కలిసి చురుగ్గా పాల్గొంటున్న సిద్ధార్థ్ను చంద్రబాబుకు పరిచయం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో విజయవాడ మేయర్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు బొండా ఉమా గట్టిగా లాబీయింగ్ చేసినట్లు సమాచారం.
Also Read : పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..? వారిదే నిర్ణయం
విజయవాడ మేయర్ పదవి అత్యంత ప్రతిష్టాత్మకమైనది కావడంతో, ఈ సీటును దక్కించుకునేందుకు టీడీపీలో మరికొందరు సీనియర్ నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే ముద్రగడ సభ వివాదం ముగియగానే బొండా ఉమా తన ఇద్దరు కొడుకులతో బాబు వద్దకు వెళ్లి మేయర్ టికెట్ ప్రపోజల్ పెట్టడం ద్వారా తాము ఈ రేసులో ఎంత బలంగా ఉన్నామో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సిద్ధార్థ్ అభ్యర్థిత్వంపై చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు లీకులు వస్తుండటంతో బెజవాడ టీడీపీ క్యాడర్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

