భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో అసలేం జరుగుతోంది..? ఈ విషయంపై మన తెలుగు మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోయినా జాతీయ మీడియా మాత్రం ఓ కన్నేసి ఉంచింది. ప్రస్తుతం ఇస్రోలో ఊహించని కొరత వెంటాడుతోంది. గత కొన్ని నెలలుగా దాదాపు 100 మందికి పైగా అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం కలకలం రేపుతోంది. దీంతో స్పేస్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై, గగన్ యాన్ వంటి ప్రతిష్టాత్మక ఫ్లాగ్ షిప్ మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను అడ్డుకునేందుకు కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది.
Also Read : తమిళనాడు కేబినెట్ భేటీలో సంచలన వ్యాఖ్యలు..!
దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగానికి తలుపులు తెరిచినప్పటి నుండి, స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్ వంటి అనేక స్టార్టప్ లు వేగంగా వృద్ధి చెందాయి. ఈ ప్రైవేట్ కంపెనీలు ఇస్రో శాస్త్రవేత్తలకు భారీ జీతాలు, స్టాక్ ఆప్షన్లు, మెరుగైన గుర్తింపు మరియు కెరీర్ లో వేగంగా ఎదిగేందుకు లీడర్ షిప్ పాత్రలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉండే సాంప్రదాయ నిబంధనల కంటే, ఈ స్టార్టప్ లలో ఉండే స్వేచ్ఛాయుత వాతావరణం యువ శాస్త్రవేత్తలను అమితంగా ఆకర్షిస్తోంది. శాస్త్రవేత్తల వలసలకు కేవలం డబ్బు మాత్రమే కారణం కాదని అంతర్గత విశ్లేషణలు చెబుతున్నాయి.
Also Read : రైతుకు రాజముద్ర ధీమా..!
గగన్యాన్ G1 టెస్ట్ ఫ్లైట్, SSLV-L1 వంటి కీలకమైన మిషన్లు అనుకున్న సమయం కంటే ఆలస్యం కావడం శాస్త్రవేత్తలలో కొంత అసంతృప్తికి దారితీసింది. అంతేకాకుండా, ఇస్రోలో సాంకేతిక మరియు పరిపాలనాపరమైన నిర్ణయాలన్నీ కేవలం చైర్మన్ కార్యాలయం నుంచే కేంద్రీకృతంగా సాగుతున్నాయని, దీనివల్ల ఆమోదాల ప్రక్రియ నెమ్మదించి క్షేత్రస్థాయిలో పని చేసేవారికి ఇబ్బందిగా మారుతోందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా సిబ్బంది ఉన్నప్పటికీ, తక్కువ సంఖ్యలోనే శాస్త్రవేత్తలు తప్పుకున్నా వారి ప్రభావం మిషన్లపై భారీగా పడనుంది. ఎందుకంటే తప్పుకున్న వారిలో చంద్రయాన్-3, గగన్యాన్ వంటి పరిశోధనల్లో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న సీనియర్ నిపుణులు ఉన్నారు.

