తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత విజయ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను తప్పుగా చూపారన్న ఫిర్యాదుపై సోమవారం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు, విజయ్ కు నోటీసులు జారీ చేసింది. విజయ్ దాఖలు చేసిన రెండు నియోజకవర్గాల అఫిడవిట్లలో ఆస్తుల విలువలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను ఆయన వెల్లడించలేదని పిటిషనర్ విఘ్నేష్ కోర్టుకు వివరించారు.
Also Read : షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.. దారుణ కామెంట్..!
విజయ్ తన నామినేషన్ అఫిడవిట్లలో పెరంబూర్ నియోజకవర్గంలో ఆస్తుల విలువను సుమారు రూ.115 కోట్లుగా పేర్కొనగా, తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో మాత్రం రూ.220 కోట్లుగా చూపించారని పిటిషనర్ ఆధారాలు సమర్పించారు. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తుల తేడాను కేవలం క్లరికల్ పొరపాటు అని కొట్టిపారేయడానికి వీల్లేదని కోర్టు వ్యాఖ్యానించింది. నిజమైన ఆస్తుల వివరాలను దాచడం అనేది ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనని అభిప్రాయపడింది.
Also Read : అమెరికాలో ఇరాన్ మహిళ అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి..!
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్లలో ఉన్న వ్యత్యాసాలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది. పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో విజయ్ పై ఇలాంటి ఆరోపణలు రావడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం కోర్టు ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే, ఈ లోపే ఆదాయపు పన్ను శాఖ, ఎన్నికల సంఘం తమ నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్తుల వివరాలు కావాలనే దాచినట్లు నిరూపితమైతే, అది విజయ్ ఎన్నికల అర్హతపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

