రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి.. మృగశిర కార్తెలో వాతావరణం చల్లబడుతుంది అనేది అందరి అభిప్రాయం. అయితే.. ఈ సారి మాత్రం పరిస్థితి విరుద్ధంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా… రోహిణి ఆరంభం నుంచే ప్రజల మాడు పగిలిపోతోంది. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. నాలుగు రోజులుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రంం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రాత్రి 8 గంటలకు కూడా వడగాల్పుల ప్రభావం ఉంటుంది. అసలు ఇదేం ఎండరా బాబు అనేస్తున్నారు ప్రజలు. మరీ ముఖ్యంగా బెజవాడ వాసులు అయితే… బ్లేజ్ వాడ అనే పేరు సార్థకమైంది అని వాపోతున్నారు. ఎవరి మీద అయినా కోపం ఉంటే.. వారిని చెప్పులు లేకుండా బెజవాడ రోడ్లపై నడిపిస్తే చాలు.. అంతకు మించిన శిక్ష లేదు అని పెద్దలంటారు. కానీ ఇప్పుడు మాత్రం మనకు కోపం ఉన్న వ్యక్తిని బెజవాడ రోడ్లపై కాసేపు నిలబెడితే చాలు.. అక్కడే పడిపోవడం ఖాయమనేలా పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థాయిలో సూర్యభగవానుడు మండిపోతున్నాడు.
Also Read : ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే తులసి షాక్ ఇచ్చారా..?
ప్రతి ఏటా మే 10 నుంచి 20వ తేదీల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతుంది. జూన్ మొదటి వారానికి వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈసారి మాత్రం మే నెలాఖరు వస్తున్నా కూడా.. ఎండ తగ్గటం లేదు. రోజు రోజుకూ పగలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్, మార్కాపురం జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 48 డిగ్రీలు దాటుతోంది. కానీ.. వేడి గాలులు, ఎండ వేడి మాత్రం.. 55 డిగ్రీలు దాటినట్లుగా కనిపిస్తోంది. వడగాల్పులకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రత పెరుగుతుంది. మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బెజవాడ రోడ్లు నిర్మానుషంగా మారిపోతున్నాయి.
Also Read : అక్కడ మాజీ మంత్రికే పలుకుబడి..!
సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయంటారు. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 8 వరకు రోహిణి కార్తె. కానీ.. రోహిణికి ముందే ఎండకు ప్రజల మాడు పగిలిపోతుంది. మిట్ట మధ్యాహ్నం అవుతుందంటే చాలు.. బెజవాడ వాసులు అదిరిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు అయితే.. డ్యూటీలు పడకూడదని వేడుకుంటున్నారు. వాహనం ఎక్కడైనా ఒక్క నిమిషం పాటు సిగ్నల్లో ఆగినా సరే.. వామ్మో అనేస్తున్నారు. పైన ఎండ వేడిమి.. కింద కాలుతున్న నేల.. పైగా వాహనాల నుంచి వచ్చే పొగ.. మొత్తానికి ఏదైనా చెట్టు దొరికితే చాలు అని అనుకుంటున్నారు. దీంతో ఇది బెజవాడ కాదురా బాబు.. బ్లేజ్ వాడ అనేస్తున్నారు.

