టాలీవుడ్ ప్రముఖ నటి నిధి అగర్వాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రచారం కేసులో ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలో, ఈరోజు హైదరాబాద్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. గతంలో ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను ప్రచారం చేసినట్లు నిధి అగర్వాల్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
Also Read : లగ్జరీ ఫ్లాట్ లు.. వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టిన చంద్రబాబు..!
ఈ ప్రచారాల వెనుక భారీగా నిధుల చేతులు మారాయనే అనుమానంతో ఈడీ మనీలాండరింగ్ కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ప్రజలను బెట్టింగ్ల వైపు ఆకర్షించారని, అందుకు ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో కమీషన్లు, పారితోషికాలు అందుకున్నారని అధికారులు గుర్తించారు. మియాపూర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పి.ఎం. ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలుత పోలీసులు కేసు నమోదు చేశారు. సెలబ్రిటీలు చేసిన ప్రకటనల వల్లే సామాన్య ప్రజలు ఆయా యాప్లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి మోసపోయారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. తెలుగు తమ్ముళ్లలో గుబులు..!
ఆ తర్వాత ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి ప్రత్యేకంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్’ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ కేసులో కేవలం నిధి అగర్వాలే కాకుండా, పరిశ్రమకు చెందిన దాదాపు 29 మంది సినీ ప్రముఖులు, యాంకర్లు, డిజిటల్ క్రియేటర్ల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలోనే పలువురు నటులు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కాగా, గతంలో ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఐడీ అధికారులు కూడా నిధి అగర్వాల్ను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఆమె ఆర్థిక లావాదేవీలు మరియు ప్రచార ఒప్పందాల అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

