తెర ముందేమో చంద్రబాబుతో దోస్తి.. తెర వెనుకేమో జగన్ మోహన్ రెడ్డితో దోస్తీ.. ఈ విషయం తెలియని వారెవ్వరూ లేరు.. ఎవరికీ వారు ఏమి తెలియనట్లు నటిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు గుట్టు బయట పడటం ఖాయం. అప్పుడు వారందరూ రాజకీయంగా సమాధి కావటం కూడా ఖాయం.. అప్పటి వరకు ఇలాంటి వారిని భరించాల్సిందే. తమ కన్నా రాజకీయంగా చంద్రబాబు ఎంతో సీనియర్.. ఆయన వంగి, వంగి దండం పెట్టరు.. అదే జగన్ మోహన్ రెడ్డి అయితే వంగి, వంగి సలాం కొడతారు. తాము చెప్పినట్లు వింటారు.. నడుచుకుంటారు కూడా. జగన్ గురించి మరిచిపోండి. మీకు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. ఆయన పై చర్యలు తీసుకోవద్దు.
Also Read : టాలీవుడ్లో పర్సంటేజీ రచ్చ.. ఎండ్ కార్డ్ పడినట్లేనా..?
అమరావతిని అభివృద్ధి చేసుకోండి.. పోలవరం పూర్తి చేసుకుని సంతృప్తిపడండి.. వివేకానంద రెడ్డి హత్య గురించి పట్టించుకున్నట్లు నటించండి.. కానీ సీరియస్గా పట్టించుకోవద్దు అని బీజేపీ ఢిల్లీ పెద్దలు చంద్రబాబుకు స్వయంగా చెప్పారనే మాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ విషయం కేంద్ర అధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు తెలిసిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్తో పాటు వైసీపీ నేతలు కూడా దారుణంగా రెచ్చిపోతున్నారనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. చంద్రబాబు ఏమీ చేయలేరనే ధీమా ఇప్పుడు వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల గురించి ఆ పార్టీ నేతలే కాదు.. టీడీపీ నేతలు కూడా పూర్తిగా మర్చిపోయినట్లు పరిస్థితి కనిపిస్తోంది.
కేంద్రంలో మోడీ, అమిత్ షాలు అధికారంలో ఉన్నంత వరకు జగన్ మోహన్ రెడ్డికి ఏమీ కాదు.. ఆయన మీద ఈగ కూడా వాలనివ్వరనే మాట బాగా వినిపిస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సినవి, రావల్సినవి.. ఏవేవో సాధించుకోవడమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. అలాగని అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా కేంద్రం ఏమీ దోచి పెట్టటం లేదు. వైసీపీ ప్రభుత్వంలో రాని నిధులను ఇప్పుడు కొంతమేర రాబట్టగలుగుతున్నారంతే. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. ఆ బెయిల్ కూడా వచ్చి 12 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే.. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ జైలులో ఎందుకు ఉన్నారో తెలియదన్నట్లుగా.. జగన్ బెయిల్ మీద బయట ఎలా తిరుగుతున్నారనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రశ్న.
జగన్ బెయిల్ గురించి అధికారంలో ఉన్న పెద్దలు సీరియస్గా తీసుకోవటం లేదు. ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సొంత బాబాయ్, ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ హత్య కేసు విచారణ ఏడున్నరేళ్లుగా కొనసాగుతోంది. సాంకేతికత అందుబాటులో ఉన్నా సరే.. హత్య చేసిన వ్యక్తి అప్రూవర్గా మారి లొంగిపోయినా సరే.. ఆ కేసులో సూత్రధారులు ఎవరనే విషయం మాత్రం సీబీఐ ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ఎందుకంటే.. సీబీఐ 2019 నుంచి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అండర్లోనే ఉంది కాబట్టి.. అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు కేంద్రం బీజేపీ పెద్దలకు తెలియకుండా జరిగిందా..? అనే ప్రశ్న అప్పట్లోనే బాగా వినిపించింది.
Also Read : ఐపీఎల్ లో కోహ్లీ సరికొత్త చరిత్ర..!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రక్షిస్తోంది మోదీ, షా మాత్రమే అని తెలుగు తమ్ముళ్లు కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ ప్రభుత్వంపైన, నాటి ప్రజా ప్రతినిధులపైన లెక్క లేనన్ని అవినీతి ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. పైగా ఇదేదో గాలిలో.. ఇప్పుడు వైసీపీ నేతలు చేసినట్లుగా చేయలేదు. ప్రతి ఆరోపణకు కూడా పక్కా డాక్యుమెంట్ చూపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పరుల తాట తీస్తామని హెచ్చరించారు కూడా. కానీ.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావస్తోంది. ఇంతవరకు జగన్ మోహన్ రెడ్డిని ఏమి చేయలేదని పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన వెంట్రుక కూడా పీకలేరని ఎన్నికలప్పుడు జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సవాల్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆ వ్యాఖ్యలు నిజమే అనిపిస్తున్నాయి.

