నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్తో అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముక లాంటి E-3 సీడ్ యాక్సెస్ రోడ్డు, బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన అడ్వాన్స్డ్ స్టీల్ వంతెనను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో విజయవాడ నుంచి అమరావతికి నేరుగా రాచబాట సిద్ధం కానుంది.
Also Read : కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు ఇండిగో గుడ్ న్యూస్..!
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు అమరావతి దశదిశను మార్చనుంది. దొండపాడు నుంచి మొదలై నేషనల్ హైవే – 16 వరకు రూ.1519 కోట్లతో 21.77 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో, 9 లేన్లతో నిర్మించిన ఈ అత్యాధునిక రహదారి ద్వారా సచివాలయం, హైకోర్టు, మంత్రుల నివాసాలు తదితర కీలక ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న ఈ రహదారులతో కరకట్టపై ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి.
ఈ రహదారి నిర్మాణంలో ఎన్నో భౌగోళిక అడ్డంకులు, భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు ఎదురయ్యాయి. అయినా సరే సీఎం చంద్రబాబు పట్టుదలతో వాటన్నింటినీ సునాయాసంగా అధిగమించి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్ వంటి జల వనరులు అడ్డుగా ఉన్నచోట వెనక్కి తగ్గకుండా..ఏకంగా రూ. 82 కోట్లతో నాలుగు వరుసల భారీ స్టీల్ వంతెనను నిర్మించి రాజధాని రవాణా వ్యవస్థకు అద్భుతమైన విజన్తో ప్రాణం పోశారు.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
ఉండవల్లిలోని స్టీల్ వంతెన దగ్గర అమరావతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన A ఆకారపు పైలాన్ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే సభలో ప్రసంగించి, కొండవీటి వాగుపై నిర్మించిన మేజర్ స్టీల్ వంతెనను పరిశీలిస్తారు. అక్కడినుంచి రాయపూడిలో సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయాలను సీఎం పరిశీలించనున్నారు. అడ్డంకులన్నీ దాటుకుని అమరావతి పరుగులు పెడుతుండటంతో రాజధాని ప్రజల్లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

