భారతదేశం నుండి అదనంగా డీజిల్ సరఫరా చేయాలంటూ పొరుగు దేశం బంగ్లాదేశ్ కోరిన అభ్యర్థనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. బంగ్లాదేశ్ అడిగిన అదనపు డీజిల్ సరఫరాను ఇప్పుడే ఖచ్చితంగా ఇస్తామని చెప్పలేమని, దీనిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన వీక్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ సంచలన వివరాలను వెల్లడించారు.
Also Read : వైసీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!
ప్రస్తుతానికి భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ద్వారా బంగ్లాదేశ్కు జరుగుతున్న సాధారణ డీజిల్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జైస్వాల్ పేర్కొన్నారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్తగా కోరిన అదనపు కోటా సరఫరాను ఆమోదించాలంటే.. ముందుగా మన దేశీయ అవసరాలు, మన దేశంలోని రిఫైనింగ్ సామర్థ్యం, అలాగే ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న డీజిల్ నిల్వలను పూర్తిగా అంచనా వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అదనపు డీజిల్ పంపాలా వద్దా అనేదానిపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
Also Read : జోగి సీటు చిరిగినట్లేనా.. గేట్ క్లోజ్..!
ఇటీవల బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ మంత్రి ఇక్బాల్ హసన్ మహ్ముద్తో బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది భేటీ అయిన సందర్భంగా ఈ ఇంధన కొరత అంశం తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్లో పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా పైప్లైన్ ద్వారా మరింత డీజిల్ను సరఫరా చేయాలని వారు అధికారికంగా భారత్ను కోరారు. గతంలో ఏప్రిల్ నెలలో కూడా భారత్ సుమారు 5,000 టన్నుల అదనపు డీజిల్ షిప్మెంట్ను బంగ్లాదేశ్కు పంపినప్పటికీ, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ మరియు దేశీయ డిమాండ్ దృష్ట్యా ఈసారి కేంద్రం మాత్రం ప్రతి అభ్యర్థనను ఆచి తూచి పరిశీలిస్తోంది.

