భయంకరమైన ఎండలో కాసేపు నడిచినా లేదా విపరీతంగా చెమటలు పట్టి అలసిపోయినా.. వెంటనే ఫ్రిజ్ లోని చల్లటి ఐస్ వాటర్ తాగాలనిపించడం సహజం. ఆ సమయంలో ఐస్ వాటర్ తాగడం వల్ల శరీరానికి ఏదో తెలియని తక్షణ ఉపశమనం, హాయి లభించినట్లు అనిపిస్తుంది. అయితే, విపరీతంగా చెమటలు పడుతున్నప్పుడు ఇలా ఐస్ వాటర్ తాగడం వల్ల అంతర్గతంగా శరీరం షాక్ కు గురవుతుందని, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Also Read : అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్..!
మనం ఎండలో ఉన్నప్పుడు లేదా చెమటలు పడుతున్నప్పుడు మన శరీర అంతర్గత ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడిని బయటకు పంపేందుకు మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. అలాంటి స్థితిలో ఉన్నట్టుండి ఐస్ కోల్డ్ వాటర్ తాగడం వల్ల గొంతు, జీర్ణవ్యవస్థలోని రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. ఈ అకస్మాత్తు మార్పు వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే సహజ ప్రక్రియ దెబ్బతింటుంది.
తీవ్రమైన వేడిలో ఉండి ఒక్కసారిగా పెద్ద పెద్ద గుటకలతో చల్లటి నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, తీవ్రమైన తలనొప్పి, లేదా కడుపు తిప్పడం మరియు కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయని ఆర్టెమిస్ హాస్పిటల్స్ నిపుణులు డాక్టర్ సీమా ధీర్ తెలిపారు. సాధారణ ఆరోగ్యవంతుల్లో ఇది గుండెపోటుకు దారితీయకపోయినప్పటికీ, ఇప్పటికే గుండె జబ్బులు లేదా లో-బీపీ సమస్యలు ఉన్నవారు ఐస్ వాటర్ తాగినప్పుడు మైకం రావడం లేదా ఛాతిలో అసౌకర్యం కలగడం వంటివి జరుగుతాయని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మీనాక్షి జైన్ పేర్కొన్నారు.
Also Read : ఎండదెబ్బకు జీర్ణక్రియ అస్తవ్యస్తం.. ఏం జరుగుతాయో తెలుసా..?
చెమటలు పట్టినప్పుడు శరీరం కేవలం నీటిని మాత్రమే కాదు, సోడియం, పొటాషియం వంటి కీలకమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. ఆ సమయంలో కేవలం ఐస్ వాటర్ మాత్రమే తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు లభించవు, ఇది కండరాల బలహీనతకు దారితీస్తుంది. కాబట్టి చెమటలు పట్టినప్పుడు ఐస్ వాటర్ కు బదులుగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం లేదా పుచ్చకాయ లాంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను తీసుకోవడం ద్వారా ఎలక్ట్రోలైట్లను పునరుద్ధరించుకోవచ్చు.

