తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టీడీపీ మహానాడు వ్యవధిని ఈసారి రెండు రోజులకు కుదించే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం మూడు రోజుల పాటు జరగాల్సిన ఈ వేడుకలను మే 27, 28 తేదీల్లోనే ముగించేలా పార్టీ సీనియర్ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ.. పొదుపు పాటించాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో.. కూటమి సర్కార్ పొదుపు చర్యలు మొదలుపెట్టింది.
Also Read : ఏపీ సచివాలయంలో వైసీపీ హవా.. నిజమేనా..?
ఈ నేపధ్యంలో.. పార్టీ పరంగా కూడా టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. మహానాడును రెండు రోజులు మాత్రమే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, మే 27 మరియు 28 తేదీల్లో ప్రతినిధుల సభను నిర్వహించి, అందులోనే కీలక రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చలు జరపనున్నారు. రెండో రోజైన మే 28వ తేదీన స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, అదే రోజు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం సిఎం చంద్రబాబు ముగింపు ప్రసంగంతో మహానాడును పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు.
Also Read : పొదుపు బాటలో ఏపీ సర్కార్.. చంద్రబాబు నుంచి పెమ్మసాని వరకు..!
ఎన్టీఆర్ జన్మదినం రోజే మహానాడు ముగిస్తే బాగుంటుందని అత్యధిక శాతం మంది నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. మరోవైపు, మే 29వ తేదీన నిర్వహించాలనుకున్న భారీ బహిరంగ సభను దాదాపుగా రద్దు చేయాలని టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం ప్రతినిధుల సభ, అంతర్గత చర్చలకే ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నంతపురం పర్యటనలో ఉన్నందున, ఆయన అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యవధి కుదింపు మరియు బహిరంగ సభ రద్దు అంశాలపై పార్టీ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించనుంది.

