ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కలలకు రెక్కలొచ్చాయి. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలలకు రెక్కలు.. పేరుతో టాప్ 6 విద్యార్థులను ఆమె స్వయంగా విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, పదవ తరగతిలో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులను ఎమ్మెల్యే సౌమ్య విమాన ప్రయాణం చేయించారు.
Also Read : గుంటూరు గడ్డపై మరో పెమ్మసాని మార్క్ సక్సెస్..!
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఈ పిల్లలకు విమానం ఎక్కడం అనేది ఒక తీరని కల. అటువంటి కలను నెరవేర్చి, వారిలో మరింత స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. గత ఏడాది కూడా టాప్ 5 విద్యార్థులను ఆమె విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల వల్లే విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు.
Also Read : భారత్ ఫై నేపాల్ ను రెచ్చగొడుతున్న చైనా..!
నందిగామ నియోజకవర్గంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాస్ పర్సంటేజ్ 4 శాతం పెరిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాబోయే మూడేళ్లు కూడా ఈ కలలకు రెక్కలు.. స్కీం ద్వారా టాపర్లను విమాన ప్రయాణం చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సౌమ్య చూపిన ఈ చొరవ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

