తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కల్తీ నెయ్యి సరఫరా వెనుక అసలు కారకుడు టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి అని తేలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టిటిడిలో నెయ్యి కొనుగోలుకు సంబంధించిన టెండరు నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా సడలించడానికి అనుమతిచ్చింది ధర్మారెడ్డేనని ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.
Also Read : బ్రేకింగ్: కృష్ణా జిల్లాలో భయపెడుతోన్న సముద్రం..!
ధర్మారెడ్డి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్లే టిటిడిలోకి కల్తీ నెయ్యి సరఫరా చేసే సంస్థలు సులభంగా ప్రవేశించాయని కమిషన్ పేర్కొంది. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా, ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా యధేచ్ఛగా కొనసాగనివ్వడం వెనుక ఆయన హస్తం ఉందని నివేదికలో వెల్లడైంది. ఈ నిర్ణయాల వల్ల కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ దెబ్బతినడమే కాకుండా, శ్రీవారి ప్రసాదం పవిత్రతకు విఘాతం కలిగిందని కమిషన్ అభిప్రాయపడింది.
Also Read : టీటీడీకి పవన్ లేఖ.. నానా పాట్లు పడుతున్న వైసీపీ..!
కేవలం ధర్మారెడ్డి మాత్రమే కాకుండా, అప్పటి ఈవో సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయంపై కూడా కమిషన్ తన నివేదికలో కీలక ప్రస్తావనలు చేసింది. పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి అవకతవకలకు పాల్పడిన ధర్మారెడ్డిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలు మార్చిన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

