కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ప్రకృతి వింత ప్రవర్తన స్థానిక ప్రజలను, మత్స్యకారులను వణికిస్తోంది. పాలకాయతిప్ప వద్ద సముద్రం ఒక్కసారిగా వెయ్యి మీటర్ల మేర ముందుకు చొచ్చుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా సముద్రం అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కొంత ముందుకు రావడం సహజం. కానీ, పాలకాయతిప్ప తీరంలో ఏకంగా వెయ్యి మీటర్ల అంటే ఒక కిలోమీటర్ మేర సముద్రపు నీరు భూభాగంలోకి చొచ్చుకువచ్చింది.
Also Read : సీఎం చంద్రబాబు.. పవన్ క్లారిటీ.. లోకేష్ మౌనం..!
అలలు దాదాపు 7 నుంచి 8 మీటర్ల ఎత్తున ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. తీరంతో విడదీయలేని అనుబంధం ఉన్న మత్స్యకారులు సైతం ఈ పరిస్థితి చూసి అవాక్కవుతున్నారు. “సాధారణంగా మే, జూన్ నెలల్లో సముద్రం శాంతంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా సముద్రం ఇంతలా ముందుకు రావడం, అలలు అంత ఎత్తున ఎగసిపడటం తమ జీవితకాలంలో చూడలేదు” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : చరిత్రలో తొలిసారి.. కార్పొరేట్ శైలిలో లోకేష్ వినూత్న ప్రచారం..!
ఇది ఏదైనా పెను తుపానుకు సంకేతమా..? లేక భూగర్భంలో జరుగుతున్న మార్పుల ప్రభావమా..? అని చర్చించుకుంటున్నారు. సముద్రం ముందుకు రావడంతో తీరంలోని మత్స్యకారుల పాకలు, పడవలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఈ మార్పులకు గల శాస్త్రీయ కారణాలను విశ్లేషించాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులు ఎవరూ తీరం వైపు వెళ్లకుండా నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.

