భారతదేశ విద్యా చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గతంలో మనం వార్తాపత్రికలు లేదా టీవీలు చూస్తే.. కేవలం కార్పొరేట్ విద్యాసంస్థల ర్యాంకుల ప్రకటనలే కనిపించేవి. తమ పాఠశాలల్లో చేరితేనే గొప్ప మార్కులు వస్తాయన్నట్లుగా ఆ సంస్థలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ యాడ్స్ ఇచ్చేవి. కానీ, ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు సైతం తామేమీ తక్కువ కాదంటూ కార్పొరేట్ సంస్థలకు దీటుగా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Also Read : మాట తప్పిన కేంద్రం.. బాదుడే బాదుడు..!
రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా, కేవలం ప్రతిభ చాటిన పేద విద్యార్థులనే హీరోలుగా చూపిస్తూ ప్రభుత్వం ఈ ప్రకటనలు విడుదల చేయడం గమనార్హం. ఈ మార్పు కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు, క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను కూడా సాధిస్తోంది. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కనీవినీ ఎరుగని రీతిలో 590 పైచిలుకు మార్కులు సాధించి సంచలనం సృష్టించారు.
కార్పొరేట్ స్కూళ్లలో లక్షల రూపాయల ఫీజులు కడితే వచ్చే మార్కులను, రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ బడుల్లో చదువుతూ మన పిల్లలు సాధిస్తున్నారనే విషయాన్ని మంత్రి లోకేష్ ఈ ప్రకటనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. “ప్రభుత్వ బడులంటే నాణ్యత లేనివి” అనే పాత ముద్రను చెరిపివేసి, వాటిని ఒక బ్రాండ్గా మార్చడమే ఈ వినూత్న ప్రచారం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం ‘స్టార్ రేటింగ్’ మరియు ‘LEAP’ (Learning Excellence in Andhra Pradesh) వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్కరణలను అమలు చేస్తోంది.
Also Read : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. దోషి ఆయనే..!
దీని ప్రభావం ఎంతలా ఉందంటే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే “నో అడ్మిషన్” అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ల దగ్గర మాత్రమే కనిపించే ఈ బోర్డులు, ఇప్పుడు ప్రభుత్వ బడుల దగ్గర కనిపించడం లోకేష్ సంకల్ప బలానికి నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్ది, సామాన్యుడి బిడ్డకు కూడా ప్రపంచస్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి.
ఒకప్పుడు ప్రభుత్వ ప్రకటనలంటే కేవలం పథకాల ప్రచారానికో, రాజకీయ లబ్ధికో పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు విద్యాశాఖ ఇచ్చిన ప్రకటనలో కేవలం విద్యార్థుల విజయగాథలు మాత్రమే ఉండటం చూసి విద్యావేత్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్ల యాడ్స్ చూసి తమ పిల్లలను అక్కడ చేర్చే తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ బడుల ప్రకటనలు మరియు ఫలితాలు చూసి తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే కాకుండా, కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో ఈ వ్యూహం భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది.

