సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలతో షాక్ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం నేరుగా వంటింటిపై పడకపోయినా, బయట తినే సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్రం ఏకంగా రూ. 993 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,071కి చేరుకుంది. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని కేంద్రం ప్రకటించడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Also Read : అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
అయితే, డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. కమర్షియల్ సిలిండర్ ధరలు ఇంత భారీగా పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిరుతిళ్ల బండ్లు నడిపే వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, ఇప్పుడు గ్యాస్ ధర కూడా పెరగడంతో హోటల్ యజమానులు ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. సామాన్యుడు ప్రతిరోజూ ఆశ్రయించే టిఫిన్ సెంటర్లు, మధ్యతరగతి హోటళ్లలో ప్లేట్ ఇడ్లీ నుంచి భోజనం వరకు అన్నింటి ధరలు రూ. 10 నుంచి రూ. 30 వరకు పెరిగే అవకాశం ఉంది.
Also Read : మాట తప్పిన కేంద్రం.. బాదుడే బాదుడు..!
టీ కొట్టు నడిపే వారు, బజ్జీల బండ్లు పెట్టుకునే వారి లాభాలు పూర్తిగా ఆవిరయ్యే ప్రమాదం ఉంది. ధర పెంచితే కస్టమర్లు రారని, పెంచకపోతే గిట్టుబాటు కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా, పనుల రీత్యా బయట ఉండేవారు, బ్యాచిలర్లు ఎక్కువగా హోటల్ తిండిపైనే ఆధారపడతారు. నెలకు వేలల్లో పెరిగే ఈ ఖర్చు వారి బడ్జెట్ ను తలకిందులు చేయనుంది. ఇంట్లో వండుకుందామంటే టైమ్ ఉండదు, బయట తిందామంటే ధరలు భయపెడుతున్నాయి అని సామాన్య జనం వాపోతున్నారు.

