వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ ను దర్యాప్తు బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయనను బదిలీ చేస్తూ, వీఆర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో సీఐ రవికుమార్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also Read : పెట్రో మంట.. ఎన్నికలు పూర్తి కాగానే లీటరుకు రూ. 25..?
ఇటీవల అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇక ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లేలోపే ఆయన అక్కడి నుంచి మాయం కావడం వెనుక సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ ప్రత్యక్ష సహకారం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు సీఐపై బదిలీ వేటు వేసి, వీఆర్ కు పంపడం గమనార్హం. మొన్న సాయంత్రం అనంతబాబును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. అయితే, ఆ సమాచారాన్ని ముందే ఎమ్మెల్సీకి చేరవేసి, ఆయన సురక్షితంగా తప్పించుకోవడానికి సీఐ రవికుమార్ మార్గం సుగమం చేశారని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
Also Read : లిక్కర్ టెండర్ల సెగ.. కారుమూరి అరెస్ట్ తప్పదా..?
సీఐ రవికుమార్, అనంతబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాం నుంచి ఎమ్మెల్సీకి వెన్నుదన్నుగా ఉన్న సీఐ, ఇప్పుడు ప్రభుత్వం మారినా తన పాత విధేయతను చాటుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులో పారదర్శకత లోపించిందని భావించిన ఉన్నతాధికారులు, దర్యాప్తు నుంచి రవికుమార్ ను తక్షణమే తొలగించారు. ఈ బాధ్యతలను తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుకు అప్పగించారు. నిందితుడు పరారీ కావడానికి సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

