దేశ రాజకీయాల్లో ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం సంచలనంగా మారింది. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటి సిఎం డీకే శివకుమార్ ఏకమై కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే, ఈ పోరాటంలో ఏపీ చంద్రబాబు ఉంటే బాగుండేది అంటూ పలువురు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : రాజకీయాలకు బొత్స గుడ్ బై..?
ఈ కూటమిలో జతకలిసి ఉంటే, ఆ ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా మరో స్థాయిలో ఉండేదనే చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. నిజానికి ఏపీలో టీడీపీ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. ఒకవేళ ఈ రాజకీయ సమీకరణాలు గనుక లేకపోయి ఉంటే, దక్షిణాది హక్కుల పరిరక్షణలో చంద్రబాబు ముందుండి నడిపించేవారనే మాట వినపడుతోంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉండి దేశ రాజకీయాలను శాసించిన అనుభవం ఆయన సొంతం. ప్రాంతీయ అస్తిత్వంపై దెబ్బ పడుతున్నప్పుడు, లోక్సభలో మన ప్రాతినిధ్యం తగ్గి దక్షిణాది మైనారిటీగా మారుతున్నప్పుడు చంద్రబాబు వంటి వ్యూహకర్త ఈ వేదికపై ఉంటే ఢిల్లీ పీఠం ఖచ్చితంగా కదిలి తీరేది.
Also Read : వైసీపీకి నచ్చని ఐఏఎస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!
ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాల మనుగడకు సంబంధించిన ప్రశ్న. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించి దేశాభివృద్ధికి తోడ్పడితే, దానికి ప్రతిఫలంగా మన సీట్లను తగ్గించి మన గొంతు నొక్కడం ఎంతవరకు న్యాయమని మేధావులు ప్రశ్నిస్తున్నారు. మన హక్కులను మనం కాపాడుకోలేకపోతే, రేపు కేంద్రం ఇచ్చే నిధుల్లో మన వాటా కోసం దేబిరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు అనుభవం ఈ పోరాటానికి తోడైతే, అది మొత్తం దక్షిణాదికే ఒక కొండంత అండగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

