త్వరలో రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఏపీ కోటా కింద నాలుగు స్థానాలు రానున్నాయి. వీటిని ఎవరికి కేటాయించాలనే అంశం కూటమి పార్టీల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీలకు చెరొకటి అనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో టీడీపీ స్థానాలు, జనసేన ఖాతాలో ఒక స్థానం ఉంటుందనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే ఎవరికెన్ని అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో ఆశావహుల జాబితా ఆసక్తిగా మారింది. నిజానికి తెలుగుదేశం పార్టీలో చాలా మంది రాజ్యసభ రేసులో ఉన్నారు.
Also Read : బ్రేకింగ్: కేసీఆర్ కు సిట్ నోటీసులు
రాజ్యసభ సభ్యత్వం కోసం తెలుగుదేశం పార్టీలో చాలా మంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్న పేరు లింగమనేని రమేష్. విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఆయనకు చెందిన గెస్ట్ హౌస్లోనే సీఎం చంద్రబాబు 12 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆ కృతజ్ఞతతోనే లింగమనేనికి రాజ్యసభ దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది. రమేష్కు చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారనే ప్రచారం కూడా పార్టీలో వినిపిస్తోంది. దీంతో రమేష్కు ఖాయమంటున్నారు పార్టీ పెద్దలు కూడా. పార్టీలోని మరికొందరు సీనియర్లు కూడా రాజ్యసభ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.
Also Read : తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్..!
ఇదే సమయంలో మిగిలిన స్థానాల కోసం యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ వంటి సీనియర్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా టీడీపీ తరఫున రాజ్యసభకు కిలారు రాజేష్ పేరు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లోకేష్కు అత్యంత ఆప్తుల్లో రాజేష్ ఒకరు. ప్రస్తుతం పార్టీ వ్యవహరాలను రాజేష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు కూడా. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నారు రాజేష్. గతంలో లోకేష్ మంత్రిగా వ్యవహరించిన సమయంలో రాజేష్ షాడోలా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయంగా బిజీ బిజీగా ఉండే నారా లోకేష్ కి ఒక నమ్మకస్తుడైన వ్యక్తి కూడా అవసరమే. ఎంతో కాలంగా పదవుల కోసం ఆశ పడకుండా లోకేష్ వెన్నంటి ఉన్న కిలారు రాజేష్ కి ఎంపి గా అవకాశం ఇస్తే మంచిదే అన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది.

అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజేష్ పేరు కూడా బాగా వినిపించింది. అప్పట్లో సీఐడీ అధికారులు రాజేష్ను కూడా విచారించారు. అలాంటి రాజేష్ను రాజ్యసభకు పంపాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కి ఆప్తుడుగా ఉన్నాడు కాబట్టే వైసీపీ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసిందని అప్పట్లోనే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ చిక్కులను న్యాయపరంగా ఎదుర్కున్నారు తప్ప ఎప్పుడు వైసీపీకి లొంగిపోలేదు. దీంతో రాజేష్ కి పార్టీ ఎంపి గా ప్రమోషన్ ఇస్తే మంచిదే అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

