దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం హాజరైంది. ఈ బృందంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొని అంతర్జాతీయ సంస్థలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశాల ఫలితంగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. ఆర్ఎంజెడ్ (RMZ) గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.
Also Read : ఏపీ సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం తుఫాన్..?
ఆర్ఎంజెడ్ గ్రూప్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన చర్చలు ఈ పెట్టుబడి ప్రతిపాదనలకు కీలకంగా మారాయి. ఈ చర్చల అనంతరం సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్లో 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖలోనే ఒక గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ను దశలవారీగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఇందుకోసం 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తున్నారు.
రాయలసీమ ప్రాంతంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఎంజెడ్ గ్రూప్ ఆసక్తి చూపింది. టేకులోడు సమీపంలో సుమారు 1000 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను సంస్థ ముందుంచింది. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో సుమారు లక్ష ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read : టీడీపీ కార్యకర్తలపై కేసుల సంగతి ఏంటి..?
దావోస్ వేదికపై ‘టీమ్ ఆంధ్రప్రదేశ్’ సమన్వయంతో సాగిన ప్రయత్నాలు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కీలకంగా నిలిచాయి. వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలతో నిర్వహించిన సమావేశాలు, రాష్ట్రానికి ఉన్న మౌలిక వసతులు, విధానపరమైన ప్రోత్సాహకాలను వివరించిన తీరు పెట్టుబడులపై నమ్మకాన్ని పెంచిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చురుకైన పాత్రతో పెట్టుబడులపై సానుకూల వాతావరణం ఏర్పడిందని, ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనుందని అభిప్రాయపడుతున్నారు.

