భారత్ లో వర్షాకాలం, శీతాకాలాల ప్రారంభంలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల కంటే చిన్న పిల్లలు ఈ డెంగ్యూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో పాటు వారి జీవనశైలి కూడా దీనికి ఒక ప్రధాన కారణం. చిన్నారులలో డెంగ్యూ తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉంటుంది, వారు ఎందుకు త్వరగా ఈ వ్యాధి బారిన పడతారు అనే అంశంపై వైద్యులు వెల్లడించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read : చిలుకూరు బాలాజీ టెంపుల్ పై అమెరికా ఏడుపులు..!
చిన్న పిల్లలు సాధారణంగా ఇళ్ల కంటే ఎక్కువగా బయట, పార్కులలో లేదా మైదానాల్లో ఆడుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే ఈడిస్ దోమలు పగటిపూట, సాయంత్రం వేళల్లోనే అత్యంత చురుగ్గా ఉంటాయి. పిల్లలు సరిగ్గా ఇదే సమయంలో బయట గడపడం వల్ల దోమకాటుకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు చిన్న పిల్లల శరీరం పూర్తిగా కవర్ అవ్వని దుస్తులు ధరించడం వల్ల కూడా దోమలు వారిని సులభంగా కుడతాయట.
పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. అందువల్ల డెంగ్యూ వైరస్ వారి శరీరంపై దాడి చేసినప్పుడు, వారి శరీరం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేదు. వైరస్ ప్రభావం వల్ల పిల్లలలో ప్లేట్ లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతుంది. డెంగ్యూ సోకినప్పుడు పెద్దలు తమకు వస్తున్న నీరసం, ఒంటి నొప్పులు లేదా కళ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలను బయటపెట్టే అవకాశం ఉంది. కానీ చిన్న పిల్లలు తమకు వస్తున్న ఇబ్బందిని సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల వ్యాధి ముదిరే వరకు తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. ఇది చిన్నారులలో ప్రాణాపాయ స్థితికి దారితీస్తోంది.
Also Read : మహేష్ ‘బాలీవుడ్ నన్ను భరించలేదు’ కామెంట్ పై విలన్ క్లారిటీ..!
పిల్లలను డెంగ్యూ బారిన పడకుండా కాపాడుకోవడానికి తల్లిదండ్రులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు బయటకు ఆడుకోవడానికి వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడే విధంగా పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ఉండేలా చూడాలి. దోమలు కుట్టకుండా ఉండేందుకు మస్కిటో రిపెల్లెంట్ క్రీములు లేదా ప్యాచెస్ ఉపయోగించాలి. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చు.

