తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు, దానికి అధికార కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన తీవ్ర విమర్శలు దుమారం రేపాయి. అయితే ఈ రాజకీయ రచ్చ మధ్య పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాతావరణం గురించి ప్రస్తావిస్తూ.. “గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం లేదు” అని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : ఇంగ్లాండ్ లో కింగ్ దిగుతాడా..?
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు కూడా సానుకూలంగా స్పందించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పవన్ కళ్యాణ్ సభలకు అనుమతి నిరాకరిస్తూ వివాదాలు సృష్టిస్తోందని, ప్రజల ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ విధమైన విమర్శలు చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు మద్దతుగా మాట్లాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బలాన్ని పెంచుకుంటున్న బీజేపీలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ – జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.
Also Read : కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మందులపై తక్షణ నిషేధం..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రా ఓటర్లు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన క్యాడర్ ప్రభావం గణనీయంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్లో మళ్లీ పట్టు సాధించాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు తెలంగాణలో జనసేనను బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ను ఒంటరిగా ఢీకొట్టడం కంటే, ఉమ్మడి శత్రువును ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్, జనసేన చేతులు కలిపితే గ్రేటర్ పరిధిలో ఇరు పార్టీలకు రాజకీయంగా భారీ లబ్ధి చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త మిత్రత్వం నిజంగానే పొత్తుగా మారుతుందో లేదో చూడాలి.

