తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో “వంద.. వంద” అంటూ బాగా ఫేమస్ అయిన డయల్ 100 అత్యవసర సేవ ఇక చరిత్ర పుటల్లోకి కలిసిపోయింది. ఆపదలో ఉన్నవారికి తక్షణ రక్షణ కల్పించే ఈ సాంప్రదాయ పోలీస్ హెల్ప్ లైన్ స్థానంలో.. సరికొత్త ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ నంబర్ డయల్ 112 ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చింది. బుధవారం రాష్ట్ర పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ అత్యాధునిక ఏకీకృత అత్యవసర స్పందన వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు.
Also Read : కృష్ణా నదిని మింగేస్తున్నారా..? అమరావతిలో కొత్త కుట్ర..?
కేంద్ర ప్రభుత్వ “వన్ నేషన్ – వన్ ఎమర్జెన్సీ నంబర్” విధానానికి అనుగుణంగా తెలంగాణ పోలీస్ విభాగం ఈ చారిత్రాత్మక మార్పును చేపట్టింది. ఇప్పటివరకు పోలీస్ సహాయం కోసం 100, అంబులెన్స్ కోసం 108, అగ్నిమాపక సిబ్బంది కోసం 101 లాంటి వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. అయితే, ఈ గందరగోళానికి తెరదించుతూ ఇకపై వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు. రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, మంటలు చెలరేగడం, మహిళలు లేదా బాలల రక్షణ మరియు వైద్య అత్యవసర పరిస్థితులు.. ఇలా ఆపద ఏదైనా సరే ప్రజలు నేరుగా 112 నంబర్ కే కాల్ చేయాల్సి ఉంటుంది.
Also Read : జంతర్ మంతర్ నిరసనల్లో ఐఎస్ఐ ఏజెంట్ల భారీ ప్లాన్..?
ఈ నూతన 112 వ్యవస్థ పాత డయల్ 100 కంటే ఎంతో వేగంగా, అత్యాధునికంగా పనిచేయనుంది. ఎవరైనా ఆపదలో ఉండి ఈ నంబర్కు కాల్ చేయగానే, జీపీఎస్ టెక్నాలజీ ద్వారా వారి ఖచ్చితమైన లొకేషన్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ గుర్తిస్తుంది. ఆ వెంటనే క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనం, బ్లూ కోల్ట్స్ టీమ్ లేదా సంబంధిత అత్యవసర విభాగాన్ని అలర్ట్ చేసి ఘటనా స్థలానికి పంపుతారు. అంతేకాకుండా, నకిలీ మరియు స్పామ్ కాల్స్ సమస్యను నివారించడానికి డీజీపీ సీవీ ఆనంద్ ఈ వ్యవస్థకు ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, డ్రోన్ టెక్నాలజీని కూడా అనుసంధానించారు.

