జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఇది జనాభాలో కలిగే మార్పుల ఆధారంగా నియోజకవర్గాలను సర్దుబాటు చేసి, సమాన రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వ్ చేయాల్సిన సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది. జనాభా పెరుగుదలను పార్లమెంటరీ బలంతో సమతుల్యం చేస్తూ, సమాన ప్రాతినిధ్యాన్ని కొనసాగించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి జన గణన తర్వాత తాజా గణాంకాలకు అనుగుణంగా పార్లమెంటరీ సీట్లు, నియోజకవర్గాల సరిహద్దులను పునః సమీక్షించడానికి పునర్విభజన తప్పనిసరిగా చేయాలి. రాజ్యాంగంలోని అధికరణ 82, 170 ప్రకారం ప్రతి జనాభా లెక్కల అనంతరం సీట్ల సంఖ్య, సరిహద్దులను సవరిస్తూ ఉండాలి.
Also Read : ఇరాన్-అమెరికా మధ్య మళ్ళీ శాంతి చర్చలు..?
మన దేశంలో ఆఖరిసారిగా డీలిమిటేషన్ను 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002లో నిర్వహించారు. అయితే ఫ్రీజింగ్ కారణంగా సీట్ల సంఖ్యను మాత్రం పెంచలేదు. అంతకుముందు 1952, 1963, 1973లలో డీలిమిటేషన్ చేపట్టారు. వాస్తవానికి 2021లోనే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా జనగణన చేపట్టకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. జనాభా నియంత్రణను ప్రోత్సహించడానికి, అధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలు ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి 1971 జనాభా లెక్కల నుంచి లోక్సభ సీట్లను నిలిపేశారు. 42వ రాజ్యాంగ సవరణ 1976 డీలిమిటేషన్ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయగా, 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 2021 వరకు పొడిగించారు. ప్రస్తుతం లోక్సభలో 543, రాజ్యసభలో 250 సీట్లు ఉన్నాయి. ఇవి 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందితే తెలుగు రాష్ట్రాల రాజకీయ సమీకరణాల్లో భారీగా మార్పులు రానున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 179కి పెరిగి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 263కు లోక్సభ స్థానాల సంఖ్య 25 నుంచి 37కు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ 30 శాతంం మహిళా రిజర్వేషన్లతో పాటు 2029 ఎన్నికల నాటికి అమలులోకి రావచ్చు. అసెంబ్లీలో అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కొత్త నియోజకవర్గాలు.. మహిళా నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు జరగవచ్చు. వీటన్నింటికీ 2011 నాటి జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోనున్నారు.
Also Read : వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. భయపెడుతున్న సెంటిమెంట్..!
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల రాజకీయ లెక్కలు పూర్తిగా మారనున్నాయి. ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క కానుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పార్టీలు మహిళలకు స్వల్ప సంఖ్యలోనే టికెట్లు ఇచ్చేవి. అది కూడా రాజకీయంగా బలమైన కుటుంబాలకే ఎక్కువ వచ్చేవి. ఇప్పుడిక మహిళలకు రిజర్వు అయ్యే నియోజకవర్గాల్లో అన్ని పార్టీలూ మహిళలకే సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి రానుంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 10 కూడా దాటడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే ఈ సంఖ్య నాలుగింతలు పెరగనుంది. ప్రస్తుతం కీలక వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో పలు నియోజకవర్గాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ నేతలు నియోజకవర్గం మారడమో లేదంటే కుటుంబంలోని మహిళలను రంగంలోకి దించడమో చేసే అవకాశం ఉంది.

