పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ పునర్నిర్మాణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆలయ నిర్మాణంపై కొన్ని మీడియా సంస్థలు హైకోర్టు స్టే విధించింది, రఘురామ కృష్ణ రాజుకు ఎదురుదెబ్బ అని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేసారు. పెదపేటలో రామాలయ నిర్మాణం, పాత నిర్మాణాల తొలగింపుపై కొందరు దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం హైకోర్టు విచారించింది. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలని హైకోర్ట్ స్పష్టం చేసింది.
Also Read : ఎంపీ మిథున్ రెడ్డిది అహంకారమా.. సమాచార లోపమా?
అప్పటివరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది. అంతేకాకుండా, ఈ వివాదంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీనిపై రఘురామ కృష్ణం రాజు స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్లుగా కోర్టు ఆలయ నిర్మాణంపై ఎటువంటి శాశ్వత స్టే విధించలేదని స్పష్టం చేసారు. ప్రభుత్వ భూమిలో ఏదైనా నిర్మాణం చేపట్టేటప్పుడు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
Also Read : వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. భయపెడుతున్న సెంటిమెంట్..!
అనుమతులు రాకుండా మేము పనులు మొదలుపెట్టము అని ప్రభుత్వమే కోర్టుకు చెప్పింది కాబట్టి, కోర్టు ప్రత్యేకంగా స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారని రఘురామ వివరించారు. ఇది కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియ మాత్రమే తప్ప, నిర్మాణానికి వ్యతిరేక తీర్పు కాదని స్పష్టం చేసారు. పాత ఆలయం ఉన్న చోటే నూతన ఆలయం కడుతున్నాం కాబట్టి అనుమతులు త్వరగా వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం భక్తుల నుండి కోటి రూపాయల విరాళాలు వచ్చాయని, ఎవరూ అడ్డుకున్నా రామాలయ పునర్నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదనే నిబంధనను తాము పాటిస్తున్నామని, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

