ప్రపంచాన్ని యుద్ధ భయం వణికిస్తున్న తరుణంలో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై మరో వార్త ఆసక్తిని రేపుతోంది. మొదటి రౌండ్ చర్చలు విఫలమై, ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు విధించిన తర్వాతి పరిణామాల నేపథ్యంలో.. మళ్ళీ చర్చల ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే రెండు రోజుల్లోనే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రెండో రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
Also Read : ఎంపీ మిథున్ రెడ్డిది అహంకారమా.. సమాచార లోపమా?
వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ తో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి అమెరికా మరోసారి ప్రయత్నిస్తోంది. వచ్చే రెండు రోజుల్లోనే ఇస్లామాబాద్లో తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉంది అని ట్రంప్ సంకేతాలిచ్చారు. మొదటి దశ చర్చల్లో సయోధ్య కుదరకపోవడంతో వాషింగ్టన్ కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి రౌండ్ చర్చలు కూడా పాకిస్థాన్ వేదికగానే జరిగాయి.
Also Read : రోజా, బైరెడ్డిపై కేసు నమోదు..?
భౌగోళికంగా మరియు వ్యూహాత్మకంగా ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ప్రాంతం కావడంతో మళ్ళీ ఇస్లామాబాద్నే వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే, గత చర్చల తర్వాత ఇరాన్ ప్రతినిధులు ఎదుర్కొన్న భద్రతా ముప్పుల నేపథ్యంలో.. ఈసారి భద్రత విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ రెండో రౌండ్ చర్చలు కూడా విఫలమైతే.. మధ్యప్రాచ్యంలో యుద్ధం అనివార్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ వంటి దేశాల సహకారాన్ని కూడా ట్రంప్ కోరుతున్న తరుణంలో.. ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

