పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్ అధికారి సాగించిన అకృత్యాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రక్షించాల్సిన అధికారియే భక్షకుడిగా మారి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర చర్చకు దారితీసింది. వినుకొండ మాజీ సీఐ చిన్న మల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, చంపుతానని బెదిరించి లోబర్చుకున్నారని బాధితురాలు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read : గ్లాడియేటర్స్ డాక్యుమెంటరీ.. అజిత్ రేసింగ్ లైఫ్..!
కేవలం వేధింపులే కాకుండా, బాధితురాలిని మానసికంగా కుంగదీస్తూ ఆ అధికారి వ్యవహరించిన తీరుపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన బయటపడగానే వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తక్షణమే స్పందించారు. బాధితురాలు తన గోడును వెళ్లబోసుకోగా, ఆమెకు పూర్తి భరోసా కల్పించి న్యాయం జరిగేలా చూస్తానని మాటిచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి, జరిగిన అన్యాయాన్ని వివరించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యే చొరవతో విచారణ వేగవంతం కావడమే కాకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న మల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ అధికారిపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు. నాడు అధికార పార్టీ అండతో విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం, తుపాకీతో బెదిరించడం వంటి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
Also Read : మత మార్పిడికి బ్రేక్ పడుతుందా..? పాస్టర్ కు సర్కార్ షాక్..!
ఇప్పుడు అదే అహంకారంతో ఒక మహిళ జీవితంతో ఆడుకోవడం క్షమించరాని నేరమని, కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా బాధితురాలికి అండగా నిలవడమే కాకుండా, తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకునేలా చేయడంలో ఎమ్మెల్యే సఫలీకృతమయ్యారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన అవసరమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

