గత కొంత కాలంగా క్రీడలకు ప్రోత్సాహం అందించే దిశగా అడుగులు వేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ మేళాకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ మ్యాచ్ లను స్టేడియంలో చూసిన అనుభూతిని కల్పించేందుకు బీసీసీఐ సహకారంతో ‘టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్’ను ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించి బీసీసీఐ ఈ అరుదైన అవకాశం ఇచ్చిందని ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ వెల్లడించారు.
Also Read : రంగంలోకి ఫేక్ గాళ్లు.. కూటమి సర్కార్ బీ అలర్ట్..!
ఏప్రిల్ 25, ఏప్రిల్ 26 తేదీల్లో ఈ ఫ్యాన్ పార్క్ అందుబాటులో ఉంటుంది. రెండు రోజుల పాటు భారీ స్క్రీన్లపై నాలుగు ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇక్కడి విశేషం ఏంటంటే.. మంగళగిరి ఫ్యాన్ పార్క్ లో అభిమానుల సందడిని స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంటే మంగళగిరి క్రికెట్ జోష్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టీవీ స్క్రీన్లపై కనిపించబోతోంది. వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం తాగునీరు, పార్కింగ్ వంటి అన్ని మౌలిక వసతులను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు.
మంగళగిరిని కేవలం రాజకీయ కేంద్రంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన చొరవతోనే మంగళగిరిలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మంగళగిరి స్టేడియానికి ఉన్న కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తూ, జూన్ 5వ తేదీలోపు స్టేడియం రోడ్ల పనులను పూర్తి చేస్తామని సానా సతీష్ స్పష్టం చేశారు. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక క్రీడాకారులకు, యువతకు పెద్ద వరంగా మారబోతోంది.
Also Read : బ్రేకింగ్: ఏపీ మద్యం కుంభకోణం.. నిందితుల ఇళ్లపై ఈడీ మెరుపు దాడులు..!
రాజధాని అమరావతిలో క్రికెట్ వైభవాన్ని చాటేలా మరో భారీ ప్రాజెక్టుకు ఏసీఏ శ్రీకారం చుట్టబోతోంది. సుమారు 30,000 నుంచి 40,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా అత్యున్నత ప్రమాణాలతో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ మ్యాచ్ల సందడి మరింత పెరగనుంది. మొత్తానికి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటుతో మంగళగిరిలో క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరింది. రాజధాని ప్రాంతాన్ని క్రీడల రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.

