బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో.. నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ రకంగా యుద్ధం ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన నిర్మాణ లోపాలు, అంతులేని అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయిస్తూ, తక్షణమే కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను వెలికితీయడంలో రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదనే సంకేతాన్ని ఈ నిర్ణయంతో స్పష్టం చేశారు.
Also Read: విశాఖలో ఇన్ఫోసిస్ మెగా క్యాంపస్.. సర్కార్ కీలక నిర్ణయం..!
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న ముఖ్యమంత్రి, కాలయాపన చేయకుండా ఈ ఫైలుపై ముందుకు కదిలారు. కేవలం లేఖ రాయడమే కాకుండా, అవసరమైతే రాష్ట్ర మంత్రుల బృందం స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయాలని సూచించడం.. రేవంత్ ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధమవుతోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రేవంత్ క్లారిటీ ఇస్తున్నారు.
Also Read: మాచర్లలో సంచలనం.. జూలకంటిపై అటాక్..!
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఈ కీలక సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం, ఖర్చుల విషయంలో జరిగిన గోల్ మాల్ పై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను బోనులో నిలబెట్టడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పావులు కదుపుతోంది.

