దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిన తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి.. అనూహ్యంగా ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ లో రాజకీయ సెగలు రేగుతున్న తరుణంలో జరిగిన ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు, కీలక నేతలతో రేవంత్ రెడ్డి సరదాగా గడిపారు.
Also Read : మెగా కాంపౌండ్పై ఎందుకింత కుట్ర..?
ఒక టీడీపీ నేత ఇచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు వెళ్లినట్లు సమాచారం. పాత మిత్రులను కలుసుకున్న రేవంత్ రెడ్డి, వారితో కలిసి రాజకీయాలకు అతీతంగా నవ్వుతూ, ముచ్చటిస్తూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిన్న పార్లమెంట్లో అత్యంత కీలకమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా బిల్లు – డీలిమిటేషన్) వీగిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ బిల్లును విపక్షాలు అడ్డుకున్న నేపథ్యంలో, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్డీఏ నేతలతో కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా..? అన్న కోణంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
Also Read : డీలిమిటేషన్కు బ్రేక్.. నేతల ఆశలు ఆవిరి..!
సాధారణంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా లేదా వ్యక్తిగత స్నేహాల రీత్యా ఈ భేటీ జరిగిందా..? లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు ఇది నాంది కాబోతోందా..? అన్న ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా, బిల్లు వీగిపోయిన మరుసటి రోజే ఢిల్లీ నడిబొడ్డున రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతలతో బ్రేక్ ఫాస్ట్ చేయడం సంచలనమే.

