ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమలు చేసిన వినూత్న విద్యా సంస్కరణలు పదో తరగతి ఫలితాల్లో స్పష్టమైన మార్పును చూపించాయి. పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి మంత్రి లోకేష్ రూపొందించిన “వంద రోజుల ప్రణాళిక” అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరగడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ సంస్థలకు ధీటుగా రాణించాయి. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Also Read : అమెరికన్ భారతీయులకు కొత్త సమస్య..!
గతేడాది ఇదే సమయానికి 81.14 శాతంగా ఉన్న ఉత్తీర్ణత, ప్రస్తుత విద్యా సంవత్సరం నాటికి గణనీయంగా మెరుగుపడటం గమనార్హం. ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. గతంలో 72.8 శాతంగా ఉన్న సర్కారీ బళ్ల ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి చేరుకోవడం మంత్రి లోకేష్ ప్లానింగ్ సక్సెస్ కు నిదర్శనంగా నిలిచింది. ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు.
Also Read : పూడి శ్రీహరి.. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లో ఏముంది..?
అన్ని రకాల యాజమాన్య పాఠశాలల్లోనూ ఫలితాలు మెరుగుపడటంపై విద్యాశాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఫలితాల విడుదల అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడకుండా త్వరలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని లోకేష్ పేర్కొన్నారు.

