ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయానకమైన మరియు మానవ తప్పిదాల వల్ల సంభవించిన మెగా జల విపత్తుకు సంబంధించిన సంచలన నిజాలు ఇప్పుడు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. యాభై ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ చైనా దేశంలో ఒకే ఒక్క రాత్రి వ్యవధిలో ఏకంగా 62 డ్యాములు ఒకదాని వెనుక ఒకటి పేకమేడల్లా కూలిపోయి, సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు జలసమాధి అయ్యారు. అయితే, ఇంతటి ఘోరమైన విపత్తు సంభవించినప్పటికీ, ఆనాటి చైనా ప్రభుత్వం ఆ నిజాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియకుండా ఏకంగా ఇరవై ఏళ్ల పాటు అత్యంత రహస్యంగా దాచిపెట్టింది.
Also Read : కన్వర్ట్ అయితేనే వైసీపీలో పదవులా..? డ్యామేజ్ అయిన జగన్ ఇమేజ్
ఈ చారిత్రక విపత్తు 1975 ఆగస్టు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి వేళ చోటుచేసుకుంది. చైనాలోని హెనాన్ ప్రాంతంలో ‘టైఫూన్ నినా’ అనే భయంకరమైన తుఫాను కారణంగా కేవలం మూడు రోజుల్లోనే ఒక ఏడాది పొడవునా కురవాల్సిన వర్షపాతం కురిసింది. దీనితో చైనా ఇంజనీర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, ఎప్పటికీ బద్దలుకాని ‘ఐరన్ డ్యాం’ అని పిలుచుకున్న ‘బాంకియావో డ్యామ్’ వరద ఉధృతిని తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయింది. ఆ ప్రధాన జలాశయం తెగడంతో, దాని కింద గొలుసుకట్టుగా ఉన్న మరో 61 డ్యాములు వరుసగా కొట్టుకుపోయాయి.
Also Read : రాఖీ పండుగ శుభవేళ.. చెల్లెళ్ళ ముఖం చూడని అన్నలు
ఈ ప్రళయం కారణంగా 20 అడుగుల ఎత్తున దూసుకొచ్చిన నీటి గోడ వందలాది గ్రామాలను, నగరాలను క్షణాల వ్యవధిలో నామరూపాలు లేకుండా చేసింది. వరద ముంచెత్తిన మొదటి రోజే ఇరవై ఆరు వేల మంది చనిపోగా, ఆ తర్వాత రోజుల్లో సరైన ఆహారం, మందులు అందక, కలరా వంటి అంటువ్యాధుల కారణంగా మరో లక్షన్నర మందికి పైగా ఘోరంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి భారీ విషాదంపై అప్పట్లో చైనా మీడియాలో కనీసం ఒక్క చిన్న వార్త కూడా రాకుండా ప్రభుత్వం అణచివేసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న భారీ డ్యామ్ల భద్రతపై భారతీయ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో, ఈ పాత బాంకియావో విపత్తు పర్యావరణ సమతుల్యతకు ఒక చేదు గుణపాఠంగా నిలుస్తోంది.

