విజయవాడలోని ప్రముఖ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో మంగళవారం భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఎల్లప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్ ఆవరణలో ఒక అనుమానాస్పద బ్యాగ్ కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. బస్టాండ్లో ఎవరూ లేని చోట పడి ఉన్న ఒక బ్యాగ్ను గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ప్రయాణికుల నుంచి అందిన సమాచారంతో కృష్ణలంక పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read : కేంద్రం ఒత్తిడికి దిగొచ్చిన మెటా.. ఆ కంటెంట్పై సంచలన నిర్ణయం..!
భద్రతా చర్యలు చేపడుతూ ఆ బ్యాగ్ను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసుల ప్రాథమిక తనిఖీల్లో ఆ బ్యాగులో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. బ్యాగును తెరచి చూడగా అందులో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్, వాటితో పాటు 50 డిటోనేటర్లు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న ఈ పేలుడు పదార్థాల మొత్తం బరువు సుమారు 5 కిలోల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు బస్టాండ్కు చేరడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
Also Read : చంద్రబాబు అంటే ఇంత భయమెందుకు..?
ఓ ప్రయాణికుడు ఈ బ్యాగ్ను బస్టాండ్లో వదిలి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అసలు ఆ బ్యాగ్ను వదిలి వెళ్లిన వ్యక్తి ఎవరు..? ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు..? ఈ పేలుడు పదార్థాలను ఎక్కడికి తరలించాలని ప్లాన్ చేశారు..? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి..? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడిని గుర్తించేందుకు బస్టాండ్ ఆవరణలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పేలుడు పదార్థాలు లభ్యమైన ప్రాంతంతో పాటు బస్టాండ్లోని అన్ని ప్లాట్ఫారాలు, ప్రయాణికుల వేచి ఉండే గదుల్లో పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

