ఏపీలో అధికారం కోల్పోయినా వైసీపీ నేతల వైఖరిలో మాత్రం మార్పు కనపడటం లేదనే ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. తాజాగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన హడావుడే దీనికి నిదర్శనంగా చెప్పాలి. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ వస్తున్నారని స్వాగతం పలికేందుకు విమానాశ్రయం గేటు ముందు ఆయన వెనుకా ముందు ఆలోచించకుండా హడావుడి చేసారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నాలుగు కార్లతో ఆయన పోలీసులను ప్రజలను ఇబ్బంది పెట్టారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు కార్లలో పార్టీ కార్యకర్తలతో వెలంపల్లి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ వద్ద జులై 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పోలీసులను కూడా లెక్క చేయకుండా పక్కకు తోసేసారు వైసీపీ కార్యకర్తలు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనితో ఈసారి పోలీసులు జాగ్రత్త పడ్డారు. వైసీపీ చేసే హడావుడిని ముందుగానే ఊహించి తగు చర్యలు చేపట్టారు.
అనుమతి లేని వాహనాలు, కార్యకర్తలను పోలీసులు విమానాశ్రయం బయటే ఆపేశారు. ఎటువంటి ప్రయాణ పత్రాలు లేని కార్యకర్తల కార్లను విమానాశ్రయం బయటే ఆపేయడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అయితే మాజీ మంత్రి వెలంపల్లి కారును మాత్రం లోపలి అనుమతించి ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తల కార్లను అడ్డుకున్నారు. దీనితో ఆ కార్లను ఎందుకు అనుమతించరు అంటూ వెలంపల్లి కారు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో సీరియస్ అయిన స్థానిక పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐ వరప్రసాద్ డైరెక్ట్ గా వెల్లంపల్లికి ఆ మాట చెప్పడంతో అక్కడి నుంచి వెల్లంపల్లి వెళ్ళిపోయారు.

