ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక దేశాలలో ఒకటైన రష్యా, ప్రస్తుతం తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి రష్యా ఏకంగా భారతదేశం నుండి గ్యాసోలిన్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, రష్యాలో పెట్రోల్ కొరత తీవ్రం కావడంతో భారత్ వైపు మొగ్గు చూపక తప్పలేదు. రష్యాలోని దాదాపు 11 టైమ్ జోన్లలో ఇంధన బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి రావడమే కాకుండా, అక్కడ పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!
రష్యా వంటి చమురు దేశంలో ఈ స్థాయి సంక్షోభం రావడానికి ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడులే ప్రధాన కారణం. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ దళాలు రష్యాలోని ప్రముఖ ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని భారీగా డ్రోన్ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో రష్యా చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్రంగా దెబ్బతినడంతో అంతర్గతంగా పెట్రోల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం తన మంత్రివర్గ సమావేశంలో స్వయంగా అంగీకరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పొరుగు దేశాల నుండి తగిన ధరలకు ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశంపై క్రెమ్లిన్ చర్చిస్తోంది.
Also Read : మహీంద్రా సరికొత్త రికార్డు.. చరిత్రలోనే తొలిసారిగా..!
ఈ సంక్షోభ నివారణలో భాగంగా ఇప్పటికే భారతదేశం నుండి కనీసం 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ ను రష్యాకు రవాణా చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక్కొక్కటి 30,000 నుండి 40,000 టన్నుల సామర్థ్యం గల రెండు భారీ చమురు ట్యాంకర్లు భారత్ నుండి రష్యాకు బయలుదేరాయి. రష్యా తన దేశీయ అవసరాల కోసం ప్రతి నెలా వివిధ దేశాల నుండి మొత్తం 4,00000 టన్నుల పెట్రోల్ దిగుమతి చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ దిగుమతులను సులభతరం చేసేందుకు మరియు సబ్సిడీలు ఇచ్చేందుకు వీలుగా రష్యా పార్లమెంట్ తన ట్యాక్స్ కోడ్ లో కూడా ప్రత్యేక సవరణలు చేయడం గమనార్హం.

