దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అధికారిక నివాసంలో బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్రనేతల మధ్య అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, కొత్త సంస్థాగత మార్పులపై ఇరు సంస్థల నాయకులు లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బలోపెతంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read : సాయికృష్ణ కేసులో వైసీపీ అసలు ఆసక్తి వేరే..!
ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఈ సమన్వయ సమావేశం జరగడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లతో పాటు ఆర్ఎస్ఎస్ తరఫున కీలక నేత అరుణ్ కుమార్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. నూతన జాతీయ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయే కొత్త కార్యవర్గాన్ని ఖరారు చేయడమే ఈ భేటీ ప్రధాన ఎజెండాగా సమాచారం.
Also Read : తిరుపతిలో కేఎఫ్సీ, డొమినోస్ ల ఫుడ్ తింటున్నారా..?
కేంద్ర మంత్రి వర్గంలో ఉండే కొందరు కీలక నేతలను పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకురావడం, అనుభవజ్ఞులతో పాటు యువ నాయకత్వానికి సమ ప్రాధాన్యత కల్పించేలా కొత్త రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరు, వివిధ రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. త్వరలోనే బీజేపీ నూతన జాతీయ కమిటీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

