కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రధాని మోడీ కసరత్తులు ప్రారంభించినట్లు ఢిల్లీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రక్షాళనలో భాగంగా పనితీరు సరిగా లేని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు, యువ నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
Also Read : ఒక్క ఛార్జ్తో 440 కిలోమీటర్ల రేంజ్.. స్కోడా అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్యూవీ..!
ఈ తాజా ఊహాగానాల్లో కొన్ని ఆసక్తికరమైన పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఎంపీ రాఘవ్ చడ్డాకు ఈసారి కేబినెట్ పదవి దక్కే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం లోక్సభ స్పీకర్ గా ఉన్న ఓం బిర్లాను కూడా కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, లోక్సభ స్పీకర్ స్థానాన్ని ఈసారి ఒక మహిళా ప్రజాప్రతినిధికి కేటాయించే అవకాశం ఉంది.
Also Read : పంత్ ను ఎందుకు పక్కన పెట్టినట్లు..?
ఈ కేబినెట్ విస్తరణలో తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత దక్కనుందని సమాచారం. తెలంగాణ నుండి ఇద్దరు కీలక నేతలకు కేంద్ర సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్, అలాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లకు ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కవచ్చనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు, ప్రస్తుతం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డి శాఖను మార్చే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

