రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా మార్చే దిశగా ఏపీ సర్కార్ ఒక సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామ పరిధిలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, మొదటి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది. దాదాపు 400 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో, 598 హెక్టార్ల అంటే సుమారు 1,477 ఎకరాలు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టును వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు.
Also Read : పవన్ అడ్డా అదేనా.. ఎవరూ మార్చలేరా..?
బంగారం, వెండి వంటి విలువైన ఖనిజాల వెలికితీతలో అంతర్జాతీయ అనుభవం ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ త్రివేణి ఎర్త్ మూవర్స్, డెక్కన్ గోల్డ్ మైన్స్ భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలోకి తీసుకువచ్చింది. జొన్నగిరితో పాటు పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ గనుల్లో సుమారు 13.1 టన్నుల ధృవీకరించిన బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ కర్మాగారం ద్వారా తొలి ఏడాదిలో దాదాపు 600 నుండి 800 కిలోల పసిడిని ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
Also Read : చిన్న పిల్లలపైనే డెంగ్యూ దోమల దాడి.. ఎందుకో తెలుసా?
రాబోయే రోజుల్లో దీనిని ఏడాదికి గరిష్టంగా 1,000 కిలోల శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేసేలా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిన్న అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ గురించి కీలక ప్రకటన చేసారు. భారత్ లో అంతర్గతంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 50 నుండి 60 శాతం వాటాను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే తయారు చేసే అద్భుతమైన అవకాశం ఈ జొన్నగిరి ప్రాజెక్ట్ ద్వారా లభిస్తుందని సంచలన ప్రకటన చేశారు. విదేశాల నుంచి భారీగా జరిగే బంగారం దిగుమతులను తగ్గించి, దేశీయంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాకుండా, ఈ మైనింగ్ ప్లాంట్ ద్వారా స్థానికంగా ఉండే సుమారు 90 శాతం మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో, వెనుకబడిన రాయలసీమ ప్రాంత పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలవబోతోంది.

