పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు పోయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుకు కుప్పం ఎలా సొంతమైందో.. పులివెందుల అనగానే వైఎస్ కుటుంబం పేరు ఎలా వినిపిస్తుందో.. అలాగే పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్కు అంత సొంతం అయ్యింది. పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, కుప్పంలో చంద్రబాబును ఓడించటం ఎంత కష్టమో.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించటం కూడా అంత కష్టమనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.
2024లో పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి.. ఆ నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చిన నేపథ్యంలో.. అక్కడి ఓటర్లు గర్వంగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. పిఠాపురం నుంచి పవన్ గెలుపు ఖాయమంటున్నారు. పిఠాపురంలో ఇప్పుడు అందరిలో పవన్ పేరు బలంగా వినిపిస్తోంది కూడా. ఇక తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా తన సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినట్లు వర్మతో పాటు ఆయన అభిమానులు కూడా తొలి నుంచి ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read : అర్ధరాత్రి టన్నెల్ లోకి.. తెల్లారితే ఢిల్లీకి.. నిమ్మల డెడికేషన్ కి ఫిదా..!
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని వర్మ గంపెడాశ పెట్టుకున్నారు. కానీ.. తనకు బదులుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో చీటికి మాటికి నియోజకవర్గంలో గొడవ పడుతున్నారు. కేవలం ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని వర్మ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వర్మ లాంటి నేత పార్టీని వీడటం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు.
కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మూడుసార్లు పోటీ చేసిన వర్మ.. ఒక్కసారి మాత్రమే గెలిచారు. పిఠాపురంలో పవన్ను మెజారిటీ ప్రజలు, ఓటర్లు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వర్మ వల్ల పవన్కు ఎలాంటి ముప్పు లేదనేది వాస్తవం. వర్మ టీడీపీలో ఉంటేనే ఆ పార్టీ అభిమాన ఓటర్ల మద్దతుంటుంది. అంతే కానీ టీడీపీ ఓటర్లందరూ వర్మ వెనుక ఉంటారనుకోవటం అంత కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం టీడీపీ అభిమాన ఓటర్లు కూడా పవన్ వైపు ముగ్గు చూపిస్తున్నారనేది వాస్తవం. పవన్తో టీడీపీ పొత్తు వల్లే కూటమి సర్కార్ భారీ విజయం సాధించిందనేది లోకేష్ పదే పదే చెబుతున్న మాట.
Also Read : మహేష్ ‘బాలీవుడ్ నన్ను భరించలేదు’ కామెంట్ పై విలన్ క్లారిటీ..!
కాపు నేతగా స్వయం ప్రకటిత ముద్రగడ పద్మనాభం రెడ్డి కూడా కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ముూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో వర్మకు టీడీపీ అభిమానులు లోపాయకారిగా సహకరించడం వల్లే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారనేది బహిరంగ రహస్యం. కానీ.. వర్మ మాత్రం.. తన వల్లే పిఠాపురంలో పవన్ గెలిచారనే మాట పదే పదే చెప్పడం జనసేన, టీడీపీ నేతలకు కాస్త ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం పవన్ ఒంటరిగా పోటీ చేసినా కూడా.. గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వర్మ ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా కూడా డిపాజిట్ కూడా దక్కదనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలాంటి పరిస్థితి పిఠాపురంలో స్పష్టంగా కనిపిస్తోంది. పిఠాపురం అంటే పవన్.. పవన్ అంటే పిఠాపురం అన్నట్లుగా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు పవన్ కల్యాణ్. పిఠాపురంలో పవన్ను ఓడించటం అసాధ్యం.

