గత రెండు నెలలుగా.. ప్రముఖ జానపద గాయని మంగ్లీ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తనపై జరుగుతున్న ప్రచారాలపై తీవ్రంగా స్పందిస్తూ.. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఉన్న వీడియోలను, వార్తలను తక్షణమే తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.
Also read : ఆపరేషన్ సుమతి.. టార్గెట్ రేవంత్..!
ముఖ్యంగా తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్తున్న ఒక మైక్రో ఫైనాన్స్ వివాదంలోకి తన పేరును లాగడంపై మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. కొందరు వ్యక్తులు ముందస్తు ప్రణాళికతో, కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తూ డిజిటల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వార్తలు తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన గౌరవానికి కూడా తీవ్ర నష్టం కలిగించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు.. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డిలతో పాటు పలు మీడియా మరియు డిజిటల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
Also read : లోకేష్ మరో రాయల్ గోల్.. తమిళనాడు తర్వాత ఏపీలోనే..!
సోషల్ మీడియాలో ఉన్న వివాదాస్పద లింకులను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో తనపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా నిరోధించాలని మంగ్లీ కోర్టును అభ్యర్థించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ ఎదుటివారి గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలతో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

