“ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి వేళ నిర్భయంగా రోడ్డుపై నడవగలుగుతుందో, ఆ రోజే భారత్కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు.” అన్నారు మహాత్మా గాంధీ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు రూపొందించినా సరే.. వాటికి పెద్దగా భయపడటం లేదు.. పట్టించుకోవటం లేదు కూడా. ఓ మహిళ అర్థరాత్రి ఒంటరిగా కనిపించటం పాపం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు పోకిరీలు. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారేందుకు ఇప్పటికే అనేక ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణలో దిశ హత్యాచారం కేసు అలాంటిదే. ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ రిపేరు వచ్చి ఆగటమే ఆమెకు శాపంగా మారింది. ఆ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినా కూడా.. చాలా మంది బుద్ది ఇంకా మారలేదు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు.
Also Read : గర్ల్ ఫ్రెండ్ కల్చర్కు బ్రేక్ పడుతుందా..?
తాజాగా హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను అంచనా వేసేందుకు ఓ మహిళా అధికారి చేసిన రహస్య ఆపరేషన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థల తీరును కూడా ప్రశ్నార్థకంగా మార్చింది. అసలు నగరంలో మహిళలు సురక్షితంగా ఉన్నారా.. వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రక్షణ చర్యలు ఎలా ఉన్నాయి.. మహిళల భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తోందనే విషయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. నగరంలో మహిళల భద్రతను అంచనా వేసేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి రహస్య ఆపరేషన్ నిర్వహించారు. తన గుర్తింపును వెల్లడించకుండా, చీకటి పడిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లను అర్థం చేసుకునే లక్ష్యంతో ఆమె ఒక బస్ స్టాప్లో సాధారణ మహిళగా నటించారు.
నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్ బస్టాప్ సమీపంలో అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒంటరిగా నిలబడిన కమిషనర్ సుమతి.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ 3 గంటల వ్యవదిలో సుమారు 40 మంది యువకులు ఆమె చుట్టూ గుమిగూడారు. వారిలో చాలామంది విద్యార్థులేనని సమాచారం. ఆమె గుర్తింపు తెలియక, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అభ్యంతరకరమైన ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏమిటంటే.. 3 గంటల పాటు ఆ ప్రాంతంలో పోలీస్ గస్తీ లేకపోవడమే. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
సుమారు 3 గంటల పాటు పోకిరీలు, ఆకతాయిల వేధింపులను కమిషనర్ సుమతి భరించారు. 3 గంటల ప్రాంతంలో ఓ హోమ్ గార్డు అటుగా వచ్చి.. సదరు మహిళలను కమిషనర్గా గుర్తించి సెల్యూట్ చేయడంతో పాటు స్టేషన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సీక్రెట్ ఆపరేషన్కు తెరపడింది. పక్కనే ఉన్న స్టేషన్ నుంచి, నైట్ డ్యూటీ చేస్తున్న గస్తీ పోలీసులు, పెట్రోలింగ్ ఆఫీసర్ ఉరుకులు పరుగుల మీద బస్టాప్కు వచ్చారు. వారు రావడంతో పోకిరీలు పరారయ్యారు. మొత్తం 40 మందిని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో సమర్థవంతమైన పోలీసు గస్తీ లేకపోవడమే ఇప్పుడు ఆందోళన కలిగించింది. ఇది రాత్రిపూట నిఘా, స్పందనలో ఉన్న తీవ్రమైన లోపాలను బయటపెట్టింది.
Also Read : ముఖ్యమంత్రి కాన్వాయ్ పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఇక ఆ గుంపులోని పలువురు వ్యక్తులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు కనిపించారని, ఇది వారి అదుపులేని ప్రవర్తనకు దోహదపడిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ అనంతరం, పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ బయటకు రావడంతో.. రేవంత్ సర్కార్ను బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. “అర్ధరాత్రి వైఫల్యం”.. ఒక పోలీస్ కమిషనర్కే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?”.. అని ప్రశ్నిస్తున్నారు.
ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిణికి, అది కూడా నగర నడిబొడ్డున 40 మంది పోకిరీల నుంచి వేధింపులు ఎదురయ్యాయంటే, కాంగ్రెస్ పాలనలో మహిళల భద్రతను పాతాళానికి తొక్కేసారని విమర్శలు చేస్తున్నారు. గాంధీజీ కల – రేవంత్ రెడ్డి మార్క్ ‘రౌడీ రాజ్యం’.. అని ఆందోళన చేస్తున్నారు. దిల్సుఖ్నగర్ వంటి రద్దీ ప్రాంతంలో స్వయంగా పోలీస్ కమిషనర్నే చుట్టుముట్టి వేధించారంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతోందని.. ఇది కేవలం పోలీస్ వైఫల్యం మాత్రమే కాదు.. నేరగాళ్లలో చట్టం పట్ల భయం పూర్తిగా నశించిందని చెప్పడానికి నిదర్శనం.. అంటున్నారు. హోం శాఖ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఒక రాజకీయ అడ్డాగా మార్చేశారని విమర్శించారు. హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీని నేరగాళ్ల అడ్డాగా మార్చకండి.. అని హెచ్చరించారు.

