తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను గంటల తరబడి నిలిపివేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర డీజీపీకి కఠిన ఆదేశాలు జారీ చేశారు. తన పర్యటనల వల్ల వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
Also Read : బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్ స్టార్లతో పాన్ ఇండియా లెక్కలు..!
దీనివల్ల విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, అత్యవసర పనుల మీద వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియాలో మరియు ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వెళ్లే మార్గానికి అవతలి వైపు ఉన్న ట్రాఫిక్ ను కూడా కిలోమీటర్ల మేర నిలిపివేయడంపై పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ దృశ్యాలు వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అధికారులను హెచ్చరించారు.
Also Read : ఏపీకి మరో దిగ్గజ కంపెనీ.. లోకేష్ చేతుల మీదుగా భూమిపూజ
ముఖ్యమంత్రి పర్యటనల కోసం ట్రాఫిక్ ను నిలిపివేయడం వల్ల ప్రజా రవాణాకు ఆటంకం కలగకూడదని సీఎం స్పష్టం చేశారు. నా కాన్వాయ్ కోసం సామాన్యులను గంటల తరబడి రోడ్ల మీద ఎందుకు ఆపుతున్నారు..? అని అధికారులను నిలదీశారు. తన ప్రయాణం సాఫీగా సాగేందుకు అనువైన ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలే తప్ప, వాహనదారుల పనులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే ట్రాఫిక్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. తమది ప్రజా ప్రభుత్వం అని, పాలకుల పర్యటనల వల్ల ప్రజలు శాపనార్థాలు పెట్టే పరిస్థితి ఉండకూడదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీవీఐపీ కల్చర్ కు స్వస్తి పలికి, ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

