గుంటూరు జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన గుంటూరు ఛానెల్ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 369.20 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read : బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటు చేస్తా: విజయ్
ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 74 కిలోమీటర్ల మేర గుంటూరు ఛానెల్ ను విస్తరించనున్నారు. ఈ విస్తరణ ద్వారా ప్రస్తుతం ఉన్న 27 వేల ఎకరాల ఆయకట్టు ఏకంగా 75 వేల ఎకరాలకు పెరగనుంది. అంటే దాదాపు 48 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. కేవలం వ్యవసాయానికే కాకుండా, ఈ ప్రాంతంలోని మరో 50 గ్రామాలకు తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అలాగే, ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన బాధితులకు త్వరలోనే రూ. 60 కోట్ల పరిహారం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : కాషాయ భారతం.. కమల వికాసం..!
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే పనులు నిలిచిపోయాయని, లేదంటే ఈ పాటికి జిల్లా రైతులు ఎంతో ప్రయోజనం పొందేవారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో 4 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కలుగుతుందని, దీనివల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన వివరించారు. రానున్న రెండేళ్ల కాలంలోనే ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి, రైతులకు అంకితం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ చారిత్రక నిర్ణయం ద్వారా గుంటూరు జిల్లా సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది.

